బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వాసుదేవన్
Last Updated : బుధవారం, 6 మార్చి 2019 (12:57 IST)

చెన్నైలో అనుమానిత డ్రోన్... హై అలర్ట్‌లో ఐఎన్ఎస్ నేవీ దళం

పుల్వామా ఉగ్రదాడి అనంతరం ఇండియా-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని బాలాకోట్ ఉగ్రవాద క్యాంపులపై భారత వైమానిక దళం మెరుపుదాడుల నేపథ్యంలో, ఇరు దేశాల మధ్య నెలకొన్న ఆగ్రహావేశాలతో ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇటువంటి ఉద్రిక్త తరుణంలో చెన్నై నావల్ బేస్ ఐఎన్ఎస్ నౌకాదళం ప్రాంతంలో సోమవారం ఓ డ్రోన్ సంచరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. 
 
స్టేషన్‌లోని ఐన్ఎన్ఎస్ అడయార్ క్యాంపస్ సమీపంలో ఉదయం 11 గంటలకు ఒక డ్రోన్ ఎగురుతూ కనిపించిందని స్టేషన్ అధికారులు తెలిపారు. కాగా ఈ డ్రోన్ దాదాపు 5-10 నిమిషాలపాటు చక్కర్లు కొట్టిందని వారు పేర్కొన్నారు. దీంతో ఆ ప్రాంతంలో చిన్నపాటి డ్రోన్లు కూడా ఎగరకుండా నిషేధం విధించారు. 
 
సోమవారం డ్రోన్ గురించి ఆరా తీసినట్లు, దాని గురించి ఎటువంటి సమాచారం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసామనీ నావల్ స్టేషన్ అధికారులు పేర్కొన్నారు. వెంటనే నగర వ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్‌స్టాండ్లకు అప్రమత్తపై హెచ్చరికలు పంపినట్లు చెన్నై పోలీసులు తెలిపారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ముఖ్యమైన ప్రదేశాలకు ఈ సమాచారం అందించి అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరడం జరిగింది. ప్రస్తుతం అనుమానిత డ్రోన్‌పై దర్యాప్తుని ప్రారంభించామనీ, త్వరలోనే వీలైనన్ని వివరాలు తెలియజేస్తామనీ వారు పేర్కొన్నారు.