శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 23 మార్చి 2017 (08:56 IST)

శశికళ, పన్నీర్‌ వర్గాలకు ఈసీ షాక్‌... ఆర్కే.నగర్‌లో "రెండాకులు" చిహ్నం మాయం

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ, మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం వర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం తేరుకోలేని షాకిచ్చింది. ఆ పార్టీ అధికారిక ఎన్నికల గుర్తు రెండాకులు చిహ్నాన్ని స్తంభింపజేసి

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ, మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం వర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం తేరుకోలేని షాకిచ్చింది. ఆ పార్టీ అధికారిక ఎన్నికల గుర్తు రెండాకులు చిహ్నాన్ని స్తంభింపజేసింది. దీంతో చెన్నై, ఆర్కే.నగర్ ఉప ఎన్నికల్లో రెండాకుల గుర్తు ఎక్కడా కనిపించదు. 
 
ఈ కారణంగా ఆర్‌కే.నగర్‌ ఉప ఎన్నికలో అభ్యర్థులెవరైనా ‘స్వతంత్రులు’గానే, ఇతర గుర్తుతో పోటీ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో 37 ఏళ్ళ తర్వాత అన్నాడీఎంకే రెండాకుల చిహ్నం లేకుండానే ఎన్నికల బరిలోకి దిగనుంది. చిహ్నాన్ని గురువారం ఉదయం 10 గంటల్లోపు ఎన్నుకోవాలని కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ సూచించింది. 
 
ఆర్కేనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల నామినేషన్ గడువు గురువారం ముగియనున్న తరుణంలో రెండాకుల చిహ్నం కోసం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఇరుపక్షాలు వాదనలు వినిపించాయి. ఈ రెండు వర్గాల తరపున పలువురు సీనియర్ న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. 
 
కాగా, ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో అంతర్గత సంక్షోభం తలెత్తిన విషయం తెల్సిందే. అదేసమయంలో ఆర్కే నగర్‌ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ తరపున ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరిద్దరు రెండాకుల గుర్తు కోసం పోటీ పడటంతో ఇరు వర్గాల వాదనలు ఆలకించిన కేంద్ర ఎన్నికల సంఘం ఆ గుర్తును తాత్కాలికంగా మాయం చేసింది.