రాధేమాకు మళ్లీ చిక్కులు.. ఆయుధాల చట్టం కింద కేసు నమోదు
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధేమా మరోమారు చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే వివిధ ఆరోపణల కింద పలు కేసులను ఎదుర్కొంటున్న ఆమెపై.. ముంబై పోలీసులు తాజాగా ఆయుధాల చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. దీంతో ఆమెకు కష్టాలు మరింత ఎక్కువయ్యాయి.
గత యేడాది ఔరంగబాద్ నుంచి ముంబైకి విమానంలో ప్రయాణించారు. అప్పట్లో త్రిశూలం ధరించి విమానంలో ప్రయాణించినట్లు తేలడంతో ఆమె ఇబ్బందుల్లో పడ్డారు. ఆర్టీఐ కార్యకర్త హర్షద్ పటేల్ ఈ వ్యవహారంపై స్థానిక కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాలతో ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
అలాగే, ముంబైకి చెందిన ఓ మహిళ వరకట్న వేధింపుల కేసు పెట్టారు. అంతేకాదు రాధేమా అసభ్య నృత్యాలు చేశారంటూ గతంలో ఆరోపణలు వచ్చాయి. వీటన్నింటికి సంబంధించి ఆమెపై కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆయుధాల చట్టం కింద కూడా ఆమెపై కేసు నమోదు కావడంతో రాధేమా మళ్లీ చిక్కుల్లో పడ్డారు.