శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 16 జూన్ 2017 (13:37 IST)

రాష్ట్రపతిగా రాజకీయేతర వ్యక్తి.. తెరపైకి శ్రీధరన్ పేరు : సోనియా ఏమన్నారు?

భారత రాష్ట్రపతి అభ్యర్థిగా రాజకీయేతర వ్యక్తిని ప్రతిపాదించాలని భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి భావిస్తే.. ఢిల్లీ మెట్రోమేన్‌గా పేరుగడించిన ఇ.శ్రీధరన్ పేరును తెరపైకి తెచ్చే అవకాశాలు ఉన్నట్

భారత రాష్ట్రపతి అభ్యర్థిగా రాజకీయేతర వ్యక్తిని ప్రతిపాదించాలని భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి భావిస్తే.. ఢిల్లీ మెట్రోమేన్‌గా పేరుగడించిన ఇ.శ్రీధరన్ పేరును తెరపైకి తెచ్చే అవకాశాలు ఉన్నట్టు జాతీయ ఎలక్ట్రానిక్ మీడియా కథనాల్లో పేర్కొంటున్నాయి. 
 
ఇప్పటికే, బీజేపీ తరపున పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. వీరిలో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా ఉన్నారు. తాజాగా ఎవరిని ఎంపిక చేస్తుందన్నది అత్యంత ఉత్కంఠగా మారింది. ఎవరిని ఆ అదృష్టం వరిస్తోందో గానీ, రకరకాల పేర్లు మాత్రం ప్రచారంలోకి వచ్చేస్తున్నాయి. ఢిల్లీ మెట్రో మాజీ చీఫ్ ఇ.శ్రీధరన్ పేరు ఇప్పుడు బయటకు వచ్చింది. ఒకవేళ రాజకీయేతర వ్యక్తినే ఎంచుకోవాల్సి వస్తే శ్రీధరన్ పేరును బీజేపీ పరిశీలించొచ్చన్నది సమాచారం. 
 
ఇదిలావుండగా, రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవంగా పూర్తి చేసేందుకు కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, రాజ్‌నాథ్ సింగ్‌లు రంగంలోకి దిగారు. ఇదే అంశంపై వారిద్దరూ శుక్రవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమై చర్చించారు. అయితే, రాష్ట్రపతి అభ్యర్థి ఎవరన్న విషయంపై స్పష్టత ఇవ్వకుండా ముందుగా మద్దతుపై మాట ఇవ్వడం సాధ్యంకాదని ఆమె తెగేసి చెప్పినట్టు సమాచారం. 
 
ఇంకోవైపు బీజేపీ అభ్యర్థి విషయంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమై చర్చించారు. ఎన్సీపీ నేత శరద్ పవార్‌తోనూ శుక్రవారం భేటీ కానున్నారు. ప్రతిపక్షానికి ఆమోదయోగ్యమైన అభ్యర్థిని ఎంచుకోవాలని, అందరి ఆమోదంతో రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటన చేసింది.