బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 30 జనవరి 2015 (13:53 IST)

రాహుల్ గాంధీ వల్లే కాంగ్రెస్‌కు బై బై: జయంతి నటరాజన్ స్పష్టం..!

రాహుల్ గాంధీ కారణంగానే తాను పార్టీ నుంచి వైదొలగుతున్నానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జయంతి నటరాజన్ స్పష్టంచేశారు. ఆమె శుక్రవారం మధ్యాహ్నం చెన్నైలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఒకప్పటి కాంగ్రెస్ పార్టీ వేరు, ప్రస్తుత కాంగ్రెస్ వేరు అని అన్నారు. ప్రస్తుంత కాంగ్రెస్ పార్టీలో విలువలు లేవన్నారు. కనుకనే కాంగ్రెస్లో కొనసాగడంపై పునరాలోచన చేయాల్సి వచ్చిందన్నారు.
 
పర్యావరణ అనుమతుల విషయంలో రాహుల్ గాంధీ సూచనలు పాటించినా కూడా కేబినెట్ నుంచి ఎందుకు తొలగించారని సూటిగా ప్రశ్నించారు. అసల తనను తొలగించడానికి కారణం కూడా చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను గత 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నానని, తన నరనరానా కాంగ్రెస్ రక్తం ప్రవహిస్తోందని జయంతి నటరాజన్ అన్నారు. 
 
తాను పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతల్లో ఉన్నప్పుడు వివిధ ప్రాజెక్టులకు అనుమతుల మంజూరు చేసే విషయంలో రాహుల్ సిఫార్సులు చేసేవారని, తన సూచనలు తప్పక పాటించాలని ఒత్తిడి తెచ్చావారని తెలిపారు. రాహుల్ కార్యాలయంలోని ఓ వర్గం తనను మంత్రి పదవి నుంచి తప్పించేందుకు కుట్ర పన్నిందని తెలిపారు.
 
అయినా కాంగ్రెస్ పార్టీని వీడటం బాధాకరమన్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ తనకు ఇచ్చిన అవకాశాలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కాగా ప్రస్తుతం తాను ఏ రాజకీయ పార్టీలో చేరే యోచన లేదని జయంతి నటరాజన్ వెల్లడించారు.