శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : బుధవారం, 20 మే 2015 (10:38 IST)

బంగారానికి వడ్డీగా బంగారం.. ఎక్కడ? ఎప్పుడు?

దేశంలో అత్యాధునిక పథకాలను ప్రవేశ పెట్టే ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు. బంగారానికి వడ్డీగా బంగారం ఇచ్చేందుకు సిద్ధమైంది. బంగారం ఇళ్లలో ఉంటే నిద్రలేని రాత్రులు గడపాల్సిందే. బ్యాంకు లాకర్లో ఉంటే కాస్త సంతోషంగా ఉండవచ్చు. అయితే, అలా ఉంచడం ద్వారా ఒక్క రూపాయి కూడా లాభ లేకపోగా, లాకర్ల నిర్వహణకు డబ్బులు కట్టాల్సి వస్తుంది.  
 
అదే బ్యాంకులో బంగారాన్ని డిపాజిట్ చేసి దానికి వడ్డీ రూపంలో నగదును లేదా బంగారాన్ని పొందితే అదే 'గోల్డ్ మానిటైజేషన్' పథకం. ఈ కొత్త పథకాన్ని మోడీ ప్రభుత్వం ప్రజలకు పరిచయం చేసింది. ఈ పథకం గురించి వివరిస్తూ ప్రభుత్వ ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో... ప్రజలు ఎవరైనా 100 గ్రాముల బంగారాన్ని తాకట్టుపెట్టి 4 శాతం వడ్డీని పొందితే, సంవత్సరం తరువాత 104 గ్రాముల బంగారం లభిస్తుంది. ఆ సమయంలో ధరతో సంబంధం ఉండదు. డిపాజిట్లను స్వీకరించే బ్యాంకులు తాము ఎంత వడ్డీ ఇవ్వాలన్న విషయాన్ని స్వయంగా నిర్ణయించుకుంటాయి.
 
ఈ కొత్త పథకం కింద బ్యాంకుల్లో కనీసం 30 గ్రాముల బంగారం డిపాజిట్ చేస్తే, వడ్డీ కింద అదనపు బంగారం లేదా నగదు లభిస్తుంది. అయితే ఈ పథకం కింద బంగారును కనీసం సంవత్సరం కాల వ్యవధికి డిపాజిట్ చేయాలి. వచ్చే వడ్డీపై పన్ను రాయితీలు కూడా లభిస్తాయి. వృథాగా ప్రజల వద్ద ఉన్న బంగారాన్ని దేశ ఆర్థిక ప్రయోజనాలకు ఉపయోగించే ఆలోచనతో పాటు, బంగారం దిగుమతులకు అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతో పాటు కరెంటు ఖాతాలోటుకు పరిష్కార మార్గంగా ఈ పథకాన్ని కేంద్రం భావిస్తోంది. 
 
ఈ పథకంపై ముసాయిదా నిబంధనలను విడుదల చేసిన కేంద్రం జూన్ 2 లోగా ప్రజలు తమ తమ అభిప్రాయాలు తెలపాలని సూచించింది. కాగా, ఎంపిక చేసిన నగరాల్లో 'గోల్డ్ మానిటైజేషన్' పథకాన్ని అమలు చేస్తామని గత సంవత్సరం బడ్జెట్‌లో అరుణ్ జైట్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా సెంటిమెంట్‌కు ఎంతో విలువ ఇచ్చే ఇండియాలో, ఈ స్కీమ్ ఏ మేరకు విజయవంతం అవుతుందో వేచి చూడాలి.