శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 28 జులై 2014 (10:25 IST)

25 యేళ్ల తర్వాత కలిసిన బీహార్ మాజీ సీఎం లాలూ, నితీష్‌లు!

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరని బీహార్ మాజీ ముఖ్యమంత్రులు మరోమారు నిరూపించారు. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా బద్ధ శత్రువులుగా ఉన్న ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్, జేడీ(యూ) నేత నితీష్ కుమార్ ఇప్పుడు చేతులు కలిపారు. 1993లో జనతా పార్టీ నుంచి విడిపోయి నితీష్ కుమార్ సమతా పార్టీలో చేరిన తర్వాత చాలా కాలం పాటు వీళ్లిద్దరి మధ్యే అధికారం దోబూచులాడుతూ వచ్చింది.
 
కానీ ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికలలో బీహార్లో ఉన్న మొత్తం 40 స్థానాలకు గాను బీజేపీ ఏకంగా 31 స్థానాలు గెలుచుకుంది. దాంతో బద్ధ శత్రువులిద్దరూ మళ్లీ చేతులు కలపకపోతే ఇక మనుగడ ఉండదని భావించారు. త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో వీరిద్దరు కలిసి ముందుకు సాగాలని నిర్ణయించారు. దీంతో వీరిద్దరు ఏకమయ్యారు. అదీ కూడా 1990 తర్వాత మొదటిసారి ఇద్దరూ కలిశారు.
 
త్వరలో బీహార్లో జరుగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలలో ఆర్జేడీ, జేడీయూ తలో నాలుగు స్థానాలకు, కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలకు పోటీ చేస్తాయి. ఈ మేరకు మూడు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. అంటే, మిగిలిన పక్షాలన్నీ కలిసి బీజేపీని ఎదుర్కోడానికి సిద్ధమయ్యాయి. 
 
2010లో జరిగిన ఎన్నికల్లో ఇప్పుడు జరుగుతున్న పది అసెంబ్లీ స్థానాలకు గాను ఆరింటిలో బీజేపీ గెలిచింది. మూడింటిని ఆర్జేడీ, ఒక స్థానాన్ని జేడీ (యూ) సాధించాయి. ఈ మైత్రి ఎన్నాళ్లు సాగుతుందో.. ఎంతమేరకు ఫలితాలిస్తుందో చూడాలి.