బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 31 ఆగస్టు 2015 (13:49 IST)

ఇది వంద మీటర్ల పరుగు కాదు. మారథాన్‌ రన్ .. హార్దిక్ పటేల్

గుజరాత్‌ పటేళ్ల రిజర్వేషన్‌ పోరాటాన్ని జాతీయ స్థాయిలో చేయనున్నట్టు కార్యాచరణ కమిటి కన్వీనర్ హార్దిక్ పటేల్ వెల్లడించారు. తమది ‘ఇది వంద మీటర్ల పరుగు కాదు. మారథాన్‌ రన్‌’ అని హార్దిక్‌ పటేల్‌ ప్రకటించారు. అంతేకాకుండా, తమ ఉద్యమాన్ని ఒకటి రెండేళ్ల పాటు కొనసాగుతుందని, దేశమంతా భారీ ర్యాలీలు, సభలు నిర్వహిస్తామని ఆయన సూచనప్రాయంగా తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ ‘గుజ్జర్లు, కుర్మీలను కలిపితే 27 కోట్ల మంది సమస్య ఇది. దీనిపై దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతాం’ అని హస్తినలో ప్రకటించారు. ‘ఉద్యమ కార్యాచరణ ప్రణాళిక రచన కోసం ఢిల్లీ వచ్చాను. కేంద్రమంత్రులను కలిసే ఉద్దేశం లేదు’ అని స్పష్టం చేశారు. పటేళ్ల పోరాటానికి మద్దతిచ్చే ప్రతి వ్యక్తి, ప్రతి సమూహం, ప్రతి సంస్థతో చర్చిస్తామన్నారు. ‘గుజరాత్‌’ మోడల్‌లో తమ దగ్గరా ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నామని 12 రాష్ట్రాల్లోని పటేళ్లు చెబుతున్నారని వివరించారు.