దేశంలో ఎబోలా వైరస్ భయం లేదు : హర్షవర్ధన్
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎబోలా వైరస్ గురించి దేశ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ స్పష్టం చేశారు. గాలి ద్వారా ఈ వైరస్ వ్యాపించదని... సంపర్కం ద్వారా వ్యాపిస్తుందని వివరించారు.
గతంలో ఈ వ్యాధి మన దేశంలో వ్యాపించినట్టు దాఖలాలు కూడా లేవని తెలిపారు. ఈ వ్యాధి ప్రబలిన దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులను విమానాశ్రయాల్లోనే వైద్య సిబ్బంది పరీక్షిస్తున్నారని వెల్లడించారు.
ఇలాంటి వ్యాధులకు చికిత్స చేయడం కంటే... వాటిని నివారించడమే మేలని అన్నారు. వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని చెప్పారు. కాగా, ఎబోలా వైరస్ విస్తరించకుండా దేశంలోని అన్ని ప్రధాన ఎయిర్పోర్టుల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్న విషయం తెల్సిందే.