శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 27 ఆగస్టు 2014 (11:24 IST)

యువతి గ్యాంగ్ రేప్ : మరణ శిక్షలను నిర్ధారించిన హైకోర్టు!

ఢిల్లీకి చెందిన 19 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి, గ్యాంగ్ రేప్ చేసి, అతికిరాతకంగా హత్య చేసిన కేసులో ముగ్గురు యువకులకు కింది కోర్టు విధించిన మరణ శిక్షను ఢిల్లీ హైకోర్టు ధ్రువీకరించింది. ఈ కేసు అత్యంత అరుదైన కేసుల పరిధిలోకి వస్తుందని, దోషులు దోపిడీదారుల్లాగా ప్రవర్తించి యువతి మృతదేహాన్ని దారుణంగా ఛిద్రం చేశారని హైకోర్టు అభిప్రాయపడింది. సమాజానికి చీడపురుగుల్లాంటి ఆ యువకులకు మరణశిక్ష విధించడం సబబేనని కోర్టు అభిప్రాయపడింది. 
 
ట్రయల్ కోర్టు తమకు విధించిన మరణ శిక్షను సవాలు చేస్తూ రాహుల్, రవి, వినోద్ అనే ముగ్గురు యువకులు దాఖలు చేసుకున్న పిటిషన్‌ను న్యాయమూర్తులు నంద్‌రాజోగ్, ముక్తాగుప్తాలతో కూడిన బెంచ్ కొట్టివేస్తూ, నేరం జరిగిన తీరును బట్టి వారికి మరణశిక్షే సరైన శిక్ష అని అభిప్రాయపడింది. 
 
ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం 2012 ఫిబ్రవరి 9న గుర్గావ్‌లోని సైబర్ సిటీలో పని చేస్తున్న యువతిని ఈ ముగ్గురు యువకులు కుతుబ్ విహార్ ప్రాంతంలోని ఆమె ఇంటి సమీపంలో కిడ్నాప్ చేసి కారులో తీసుకువెళ్లి సామూహిక అత్యాచారం చేసిన తర్వాత దారుణంగా చంపేశారు. కుళ్లిపోయి ఛిద్రమైన ఆమె మృతదేహం మూడు రోజుల తర్వాత హర్యానాలోని రేవారి జిల్లా రోధాయ్ గ్రామంలోని ఓ పొలంలో కనిపించింది. 
 
ముగ్గురు యువకులు ఆమె కళ్లలో యాసిడ్ పోయడమే కాకుండా ఆమె మర్మాయవాల్లో పగిలిపోయిన మద్యం సీసాను జొప్పించినట్టు ప్రాసిక్యూషన్ ఆరోపించింది. ట్రయల్ కోర్టు ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఈ ముగ్గురికీ మరణశిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వగా హైకోర్టు ఈ తీర్పును సమర్థించింది.