బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 19 మే 2018 (16:26 IST)

#CongressDefeatsBJP : యడ్డి పదవి ఊడింది.. ఇక 'కుమార'కే పట్టాభిషేకం

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన పదవికి రాజీనామా ప్రకటించారు. బలపరీక్షకు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు తనకు లభించకపోవడంతో ఆయన రాజీనామా చేస్తున్నట్టు అసెంబ్లీలో ప్రకటించారు.

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన పదవికి రాజీనామా ప్రకటించారు. బలపరీక్షకు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు తనకు లభించకపోవడంతో ఆయన రాజీనామా చేస్తున్నట్టు అసెంబ్లీలో ప్రకటించారు. అనంతరం సభ నుంచి ఆయన బయటకు వెళ్లిపోయారు. ఇక్కడి నుంచి ఆయన నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి, గవర్నర్‌కు రాజీనామాను సమర్పించనున్నారు.
 
ఈనేపథ్యంలో, ఈసారి కూడా బీఎస్.యడ్యూరప్పకి అదృష్టం దక్కలేదనే చెప్పుకోవాలి. కేవలం రెండు రోజులకే ఆయన సీఎం పదవి ముగిసింది. బలపరీక్ష కూడా జరగకుండానే, యడ్డీ రాజీనామా చేయడం గమనార్హం. మరోవైపు కాంగ్రెస్, జేడీఎస్ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. తదుపరి ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత కుమారస్వామి పదవీబాధ్యతలను చేపట్టబోతున్నారు. 
 
అంతకుముందు విశ్వాస పరీక్షా తీర్మానంపై యడ్యూరప్ప మాట్లాడుతూ, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు పట్టం కట్టినప్పటికీ... వారికి సేవ చేసే భాగ్యం తమకు దక్కకుండా అడ్డుకుంటున్నారంటూ యడ్యూరప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనను చూసి కర్ణాటక ఓటర్లు తమకు 104 సీట్లు ఇచ్చారని, ఫలితంగా అతిపెద్ద పార్టీగా అవతరించడంతోనే గవర్నర్ తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారన్నారు.
 
కానీ, ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్, జేడీఎస్‌లు ఏకమయ్యాయని మండిపడ్డారు. సిద్ధరామయ్య పాలనలో ప్రజలకు కన్నీరు పెట్టించారని... తాను మాత్రం ప్రజల కన్నీటిని తుడుద్దామనుకున్నానని చెప్పారు. కర్ణాటక అసెంబ్లీలో ప్రసంగిస్తే ఆయన ఈ మేరకు వ్యాఖ్యనించారు.
 
లక్ష రూపాయల వరకు రైతులందరికీ రుణమాఫీ చేయాలని ఆదేశించానని యడ్డీ అన్నారు. వృద్ధాప్య, వితంతు పెన్షన్లను పెంచాలనుకున్నానని చెప్పారు. కానీ తన ప్రయత్నాలు ఫలించలేదని తెలిపారు. కర్ణాటకపై ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నడూ వివక్ష చూపలేదని అన్నారు. తన తుదిశ్వాస వరకు కన్నడ ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని ఆయన ప్రకటించారు.