గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 1 నవంబరు 2017 (08:42 IST)

యూపీఎస్సీ ఎగ్జామ్.. చూచిరాత కేసులో మరో ఇద్దరు అరెస్ట్‌

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడిన కేసులో ఐపీఎస్ అధికారి భార్యను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, మరొకరిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడిన కేసులో ఐపీఎస్ అధికారి భార్యను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, మరొకరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఐపీఎస్ అధికారి సఫీర్ కరీం కావడం గమనార్హం. వీరిద్దరినీ నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు పీటీ వారెంట్‌పై చెన్నైకు తరలించారు. 
 
శనివారం చెన్నైలో జరిగిన యూపీఎస్సీ మెయిన్స్‌ పరీక్షల్లో ఐపీఎస్‌ అధికారి సఫీర్‌ కరీమ్‌ చూచిరాతకు పాల్పడుతూ పట్టుబడిన సంగతి తెలిసిందే. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపగా, అసలు విషయం బహిర్గతమైంది. తన భార్య జాయిస్‌ సహకారంతోనే మాస్ కాపయింగ్‌కు పాల్పడినట్టు వెల్లడించాడు. దీంతో సోమవారం చెన్నై నుంచి హైదరాబాద్‌ చేరుకున్న దర్యాప్తు అధికారి అరవిందన్‌... జాయిస్‌తో పాటు లా ఎక్సలెన్స్‌ ఐఏఎస్‌ శిక్షణా కేంద్రం డైరెక్టర్‌ రాంబాబును 8 గంటల పాటు విచారించారు. 
 
ఆ తర్వాత అశోక్‌ నగర్‌లోని లా ఎక్సలెన్స్‌ శిక్షణా కేంద్రం నుంచి ల్యాప్‌టాప్‌, బ్లూటూత్‌ పరికరంతో పాటు పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతానికి దర్యాప్తు కొనసాగుతోందని, నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా మరింత మందిని విచారిస్తామని అరవిందన్‌ పేర్కొన్నారు.