పుకార్లు నిజమని తేలితే రాజకీయాలకు స్వస్తి : రాజ్నాథ్ సింగ్
తన కుమారుడు పంకజ్ సింగ్ అవినీతిపరుడు, చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తి అంటూ వస్తున్న పుకార్లపై కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. తన కుమారునిపై వస్తున్న పుకార్లు నిజమని తేలితే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ప్రకటించారు.
పంకజ్ సింగ్ అవినీతిపరుడని, చెడు ప్రవర్తన కలవాడని, అందువల్లే అతనికి గత ఎన్నికలలో నరేంద్రమోడీ టిక్కెట్ ఇవ్వలేదన్న ప్రచారం గత కొంతకాలంగా సాగుతోంది. దీనిపై రాజ్నాథ్ సింగ్ స్పందిస్తూ ఈ పుకార్లను తాను ప్రధానమంత్రి దృష్టికి, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా దృష్టికి తీసుకెళ్ళగా, వారిద్దరు విని ఆశ్చర్యపోయారన్నారు. తన కుమారుడి మీద వస్తున్న పుకార్లు నిజమని తేలితే తాను రాజకీయాల నుంచి తప్పుకోవడానికైనా సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు.
కాగా, రాజ్నాథ్ సింగ్ కుమారుడు పంకజ్ సింగ్ మీద వస్తున్న పుకార్ల మీద ప్రధానమంత్రి కార్యాలయం స్పందించింది. ఇవన్నీ గిట్టనివారు చేస్తున్న పుకార్లని, అవన్నీ అవాస్తవాలు, నిరాధారాలని, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి జరుగుతున్న ప్రచారాలని ప్రధానమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది.