శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : బుధవారం, 1 జూన్ 2016 (09:47 IST)

అదనపు కట్నం కోసం ఆశపడి భార్యను నీటిలో తోసేసి హత్య చేసిన భర్త!

అదనపు కట్నం కోసం ఆశపడిన ఓ భర్త... కట్టుకున్నభార్యను నీళ్లలోకి తోసి హత్య చేశాడు. కెనాల్ పక్కన నిలబడి తన భార్య సెల్ఫీ తీసుకుంటున్నప్పుడు అదే అదనుగా భావించిన భర్త... ఆమెను అందులోకీ తోసేసి చంపేశాడు. భార్య కాల్వలో పడిపోయిందంటూ గుండెలు బద్దలు కొట్టుకుంటూ కన్నీరుమున్నీరయ్యాడు. చివరకు పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఈ ప్రబుద్ధుడి గుట్టురట్టయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కి సమీపంలో ఉన్న సర్ధానా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
 
ఈ పూర్తి వివరాలను పరిశీలిస్తే.. అయేషా (24), భర్త ఆఫ్తాబ్ (30) ఇద్దరు కలిసి సరదాగా బయటికి వెళ్లారు. ఆమె గంగా కెనాల్ వద్ద సెల్ఫీ తీసుకోవాలని ముచ్చటపడింది. ఈ సందర్భం కోసం వేచియున్న అఫ్తాబ్... భార్య సెల్ఫీ తీసుకుంటుండంగా కాల్వలోకి తోసేశాడు. అనంతరం ఏమీ తెలియనట్లు సర్దానా పోలీస్ స్టేషన్లో తన భార్య ప్రమాదవశాత్తు కాల్వలో పడిపోయినట్లు ఫిర్యాదు చేశాడు. 
 
ఆఫ్తాబ్ చెప్పిన ఘటనా స్థలానికి వెళ్లి వివరాలను పరిశీలించిన పోలీసులకు ఆఫ్తాబ్ చెప్పిన విషయాలపై నమ్మకం కలగలేదు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. పోలీసుల విచారణలో నిజం ఒప్పేసుకున్న ఆఫ్తాబ్, భార్య అయేషాను తానే కెనాల్‌లోకి తోసి చంపేసినట్టుగా ఒప్పుకున్నాడు. 
 
కాగా, అయేషా ఆఫ్తాబ్ జంటకు ఏడాదిన్నర క్రితం పెళ్లి జరిగింది. అదనపు కట్నం కోసమే ఆఫ్తాబ్ భార్యను హతమార్చినట్టు పోలీసులు తెలిపారు. కట్నం వేధింపులతోనే అయేషాను హత్య చేసినట్టుగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.