శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 18 అక్టోబరు 2018 (11:29 IST)

అలా చేశాడంటే నమ్మబుద్ధి కావడం లేదు : రాజ్‌ఠాక్రే

బాలీవుడ్ చిత్రపరిశ్రమను మీటూ ఉద్యమం కుదిపిస్తోంది. ముఖ్యంగా, బాలీవుడ్ సీనియర్ నటి తనూశ్రీ దత్తాను లైంగికంగా వేధించినట్టు నటుడు నానా పటేకర్‌పై ఆరోపణలు వచ్చిన విషయం తెల్సిందే.
 
వీటిపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. అతడు అసభ్యంగా ప్రవర్తించే (ఇన్‌డీసెంట్) వ్యక్తే కావచ్చని, అయితే, అలా ప్రవర్తించారంటే మాత్రం నమ్మలేకపోతున్నానని ఆశ్చర్యం వ్యక్తంచేశారు. మీటూ ఉద్యమం చాలా తీవ్రమైందేనన్న ఆయన దీనిపై సోషల్ మీడియాలో రచ్చ అనవసరమన్నారు. దీనిపై కోర్టులు కూడా చర్యలు తీసుకోవాలని అన్నారు.
 
నానాపటేకర్ అసభ్యంగా ప్రవర్తించే వ్యక్తి అయి ఉండొచ్చని, కానీ ఇలా చేశాడంటే నమ్మబుద్ధి కావడం లేదన్నారు. దయచేసి ఇకపై ట్విట్టర్‌లో మీటూ ఉద్యమానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని సూచించారు. పెట్రో ధరల పెరుగుదల, రూపాయి పతనం, పెరుగుతున్న నిరుద్యోగంపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే మీటూ ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. 
 
లైంగిక వేధింపులకు గురైన మహిళలు తమ పార్టీని సంప్రదిస్తే న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. లైంగిక వేధింపులు జరిగిన పదేళ్ల తర్వాత స్పందిస్తే కుదరదని, ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేయాలని బాధిత మహిళలకు రాజ్‌ఠాక్రే సూచించారు.