మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 31 జులై 2018 (18:25 IST)

సాధ్వీ ప్రాచీ వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీకి భార్య అయినా రావాలి..

హిందూత్వ నాయకురాలు సాధ్వీ ప్రాచి మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రిపుల్‌ తలాక్‌, నిఖాహలాల వంటి దురాచారాల నుంచి తప్పించుకోవాలంటే ముస్లిం మహిళలు హిందూ యువకులను పెళ్లి చేసుకోవాలని కొత్త వివాదానికి తెరలేప

హిందూత్వ నాయకురాలు సాధ్వీ ప్రాచి మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రిపుల్‌ తలాక్‌, నిఖాహలాల వంటి దురాచారాల నుంచి తప్పించుకోవాలంటే ముస్లిం మహిళలు హిందూ యువకులను పెళ్లి చేసుకోవాలని కొత్త వివాదానికి తెరలేపారు. మథురలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. నిఖా హలాల, ట్రిపుల్‌ తలాఖ్‌ వంటి దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న మహిళలపై మౌల్వీలు ఫత్వాలు జారీ చేస్తున్నారని మండిపడ్డారు. 
 
ఇలాంటి అరాచకాలను అరికట్టాలంటే ముస్లిం యువతులు హిందూ యువకులను పెళ్లి చేసుకోవాలంటూ సలహా ఇచ్చారు. నిఖా హలాలాకు వ్యతిరేకంగా పోరాడుతున్న నీదా ఖాన్‌ (బరేలీ) సహా పలువురు ముస్లిం మహిళలతో సమావేశమై, వారందరినీ హిందూ మతంలో చేరాల్సిందిగా కోరతానంటూ సాధ్వి సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
అంతేగాకుండా.. విశ్వ హిందూ పరిషత్‌ నేత సాధ్వీ ప్రాచి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌నాథ్‌ దేవాలయాన్ని దర్శించుకున్న సాధ్వి ప్రాచి.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ నేతలకు చురకలంటించారు. ఆ పార్టీ అధినేత రాహుల్‌ గాంధీకి పెళ్లి కావాలని దేవుడి వద్ద కోరుకున్నానన్నారు. 
 
బాబా గోరఖ్‌నాథ్‌ ఆశీస్సుల కోసం ఇక్కడకొచ్చానని.. కాంగ్రెస్ నేతలు వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన మెజార్టీని సాధించలేకపోతే, కనీసం రాహుల్‌ గాంధీకి భార్య అయినా రావాలని కోరుకున్నానని సాధ్వి సెటైర్లు విసిరారు.
 
కాగా సాధ్వీ ప్రాచి చేసిన ఈ వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అశోక్‌ సింగ్‌ ఘాటుగా స్పందించారు. ''కాంగ్రెస్‌ నేతలపై వ్యాఖ్యలు చేయడం ఇటీవల సర్వసాధారణంగా మారిందని, సాధ్వి అయి ఉండి ఇలాంటి మాటలు మాట్లాడటం ఆమె స్థాయి ఏమిటో తెలియజేస్తోందని అశోక్ సింగ్ అన్నారు.