శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 27 ఆగస్టు 2015 (15:46 IST)

షీనా బోరా హత్య కేసు: పీటర్ వద్ద విచారణ.. అమ్మే హత్య చేసిందన్న మిఖిల్ బోరా

సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన షీనా బోరా హత్య కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. స్టార్ ఇండియా మాజీ సీఈవో పీటర్ ముఖర్జియా కుమారుడి వద్ద పోలీసులు విచారణ జరిపారు. రాత్రి ఆయన్ని ప్రశ్నించిన పోలీసులు షీనా కనిపించకుండా పోయినప్పుడు ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. 
 
దాదాపు సంవత్సరం పాటు షీనా బోరా, రాహుల్ ముఖర్జియాల సంబంధాలు కొనసాగుతున్నప్పుడు.. ఆమె కనుమరుగైన విషయాన్ని పోలీసులకు ఎందుకు తెలియజేయలేదని పోలీసులు ప్రశ్నించారు. పీటర్ ముఖర్జియాకి రాహుల్ కుమారుడు కాగా, పీటర్ భార్య ఇంద్రాణి ముఖర్జియాకి షీనా కుమార్తె అవుతుంది. ఈ నేపథ్యంలో తన తొలి భర్త ద్వారా ఇంద్రాణి షీనాకు జన్మనిచ్చింది. ఇక ఇంద్రాణికి పీటర్ మూడో భర్త కావడం గమనార్హం.
 
ఇదిలా ఉంటే.. గత మూడేళ్ల క్రితం హత్యకు గురైన షీనా బోరా కేసులో తల్లి ఇంద్రాణి ముఖర్జీ ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే కన్నతల్లే ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. షీనా బోరా హత్య కేసులో తల్లి ఇంద్రాణి ముఖర్జీ గురించి అసలు సంగతులు బయటపెడ్తానని కుమారుడు మిఖిల్ బోరా చెప్తున్నాడు. 
 
తన సోదరిని తల్లి ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందో తనకు తెలుసునని.. అయితే పోలీసుల ముందు తల్లి నేరాన్ని ఒప్పుకోకపోతే మాత్రం తాను సాక్షిగా మారతానని తెలిపాడు. ఆగస్టు 31వ తేదీ వరకు ఇంద్రాణికి పోలీస్ కస్టడీ విధించారు. వారి విచారణలో నేరాన్ని ఒప్పుకోకపోతే మాత్రం ఆ హత్యకు గల కారణాలను చెబుతానని మిఖిల్ బోరా అంటున్నాడు. 
 
కాగా 2012లో హత్యకు గురైన షీనా బోరా కేసులో టీవీ మొగల్ స్టార్ ఇండియా మాజీ సీఈవో పీటర్ ముఖర్జియా భార్య ఇంద్రాణిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. స్టార్ ఇండియా 2002లో స్టార్ ఇండియా సీఈఓగా పీటర్ ఉన్నప్పుడు ఇంద్రాణిని పెళ్లాడాడు. అంతకుముందే ఇద్దరికీ జరిగిన వివాహాలు విడాకులకు దారితీశాయి. అయితే ఆమెకు సిద్ధార్థ దాస్, సంజీవ్ ఖన్నాలతో జరిగిన పెళ్లిళ్ల విషయాన్ని పీటర్ దగ్గర దాచేసింది. 
 
అనంతరం చోటుచేసుకున్న పరిణామాలే కుమార్తె షీనా బోరా హత్యకు కారణమయ్యాయి. ఆ విషయాన్ని దాచిపెట్టిన ఇంద్రాణి.. షీనా అమెరికాకు వెళ్ళినట్టు అందరిని నమ్మించింది. ఈ హత్య కేసులో ఇంద్రాణి పాత్ర ఉందని తేలడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.