శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 26 నవంబరు 2017 (11:41 IST)

బెదిరింపులు ఆమోదనీయం కాదు.. పద్మావతిపై ఉప రాష్ట్రపతి

ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకునే హీరోయిన్‌గా నటించిన పద్మావతి సినిమాపై రచ్చ రచ్చ జరుగుతున్న నేపథ్యంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందించారు. సినిమా కళాకారులను బెదిరించడ

ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకునే హీరోయిన్‌గా నటించిన పద్మావతి సినిమాపై రచ్చ రచ్చ జరుగుతున్న నేపథ్యంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందించారు. సినిమా కళాకారులను బెదిరించడం.. వారిపై దాడులు చేస్తామని హెచ్చరించడం ప్రజాస్వామ్య దేశంలో ఆమోదనీయం కాదని వెంకయ్య తెలిపారు. 
 
కళాకారుల తల తెగ్గొడితే కోటి రూపాయలు బహుమతి ఇస్తామని ప్రకటించేవారి వద్ద నిజంగా కోట్లాది రూపాయలు ఉన్నాయో.. లేదోనని తనకు అనుమానంగా ఉందని వెంకయ్య పేర్కొన్నారు. నిరసనలు తెలియజేయాలంటే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి. అంతేకానీ ఇలాంటి బెదిరింపు ప్రకటనలు కూడదని వెంకయ్య హితవు పలికారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదని, అదే సమయంలో ఎదుటివారి మనోభావాలను గాయపరిచే హక్కు కూడా లేదని వ్యాఖ్యానించారు.
 
ఇకపోతే.. పద్మావతి దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. దీనిపై సినీ, రాజకీయ ప్రముఖల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. రాజస్థాన్‌లో కర్ణిసేన గత కొన్ని రోజులుగా ఆందోళనల బాటపట్టింది. అంతటితో ఆగకుండా ఈ చిత్రంలో పద్మావతిగా నటించిన దీపికా పదుకునే, అల్లా‌ఉద్దీన్ ఖిల్జీ పాత్ర పోషించిన రణ్‌వీర్ సింగ్, దర్శకుడు భన్సాలీ తలలు నరికి తెచ్చిన వారికి ఐదు నుంచి పది కోట్లు నజరానా ఇస్తామని కూడా కొందరు ప్రకటించారు.