నగదు లావాదేవీ రూ.2 లక్షలకు మించితే.. అంతే మొత్తం పెనాల్టీ కట్టాల్సిందే
ఒకే రోజులో రూ.2 లక్షలు లేదా అంతకుమించిన నగదు లావాదేవీలపై నిషేధం విధించిన నేపధ్యంలో భారీ నగదు లావాదేవీలు జరిపేవారిని ఆదాయపన్ను శాఖ హెచ్చరించింది. రూ.2 లక్షలు అంతకుమించి నగదు స్వీకరించే వారి నుంచి అంతే మొత్తం జరిమానాగా వసూలు చేస్తామని స్పష్టం చేసింది.
ఒకే రోజులో రూ.2 లక్షలు లేదా అంతకుమించిన నగదు లావాదేవీలపై నిషేధం విధించిన నేపధ్యంలో భారీ నగదు లావాదేవీలు జరిపేవారిని ఆదాయపన్ను శాఖ హెచ్చరించింది. రూ.2 లక్షలు అంతకుమించి నగదు స్వీకరించే వారి నుంచి అంతే మొత్తం జరిమానాగా వసూలు చేస్తామని స్పష్టం చేసింది. అంతేకాదు, ఈ విధమైన భారీ నగదు లావాదేవీల సమాచారం తెలిస్తే blackmoneyinfo@ incometax. gov. in తమకు తెలియజేయాలని ప్రజలను కోరింది.
2017–18 కేంద్ర బడ్జెట్లో రూ.3 లక్షలు అంతకుమించి నగదు లావాదేవీల నిర్వహణను నిషేధించే ప్రతిపాదనను ప్రవేశపెట్టగా, ఆ తర్వాత దాన్ని రూ.2 లక్షలు అంతకుమించిన లావాదేవీలకు తగ్గించి ఆర్థిక బిల్లులో సవరణ చేర్చారు. దీనికి లోక్సభ ఆమోదం తెలియజేసింది. ఇందుకు అనుగుణంగా ఆదాయపన్ను చట్టంలో సెక్షన్ 269ఎస్టిని చేర్చారు.
దీని కింద ఒకే రోజులో రూ.2 లక్షలు లేదా అంతకుమించిన నగదు లావాదేవీలు నిషేధం. ఒక అంశానికి సంబంధించి ఒక్క లావాదేవీ లేదా ఒకటికి మించిన లావాదేవీల మొత్తం రూ.2 లక్షలు నగదు రూపంలో చెల్లించడం, తీసుకోవడం చట్ట విరుద్ధం. బ్యాంకులు, పోస్టాఫీసులు, కోపరేటివ్ బ్యాంకులు, ఆదాయపన్ను శాఖలు స్వీకరించే మొత్తాలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంది.