శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: చెన్నై , శనివారం, 1 జులై 2017 (03:28 IST)

గుడ్‌మార్నింగ్‌ ఇండియా... ఒక దేశం ఒకే పన్ను నినాదంతో దేశాన్ని పలుకరించిన జీఎస్టీ..

దాదాపు 17 సంవత్సరాలుగా భారత పన్నుల వ్యవస్థ ఆశించిన కల ఎట్టకేలకు సాకారమైంది. ఒక దేశం ఒకే పన్ను నినాదంతో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) పట్టాలెక్కింది. శుక్రవారం అర్ధరాత్రి పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌ ఈ చరిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. దేశ చరిత్రలో అత్యంత

స్వాతంత్ర్యానంతర భారత చరిత్రలో అతిపెద్ద పన్నుల సంస్కరణ 17 సంవత్సరాల సుదీర్ఘ చర్చల అనంతరం ఎట్టకేలకు శుక్రవారం అర్థరాత్రి దాటాక ఉనికిలోకి వచ్చింది. దాదాపు 12 కేంద్ర, రాష్ట్రాల పన్నుల రకాలను ఏకం చేస్తూ జీఎస్టీ రూపంలో ఒక కొత్త పన్నుల విప్లవం దేశం ముందు ఆవిష్కృతమైంది. 1947లో స్వాతంత్ర్యం సిద్ధించిన అర్ధరాత్రని తలపిస్తూ చారిత్రాత్మకమైన పార్లమెంటు హాల్‌లో శుక్రవారం అర్థరాత్రి నూతన పన్ను వ్యవస్థ ప్రారంభమైంది. జాతీయ అమ్మకం పన్ను వ్యవస్థకు పరివర్తన ఎన్ని ఆటంకాలను ఎదుర్కోనుందో తెలీదు కానీ నేటినుంచి జీఎస్టీ భారత్ మార్కెట్‌లో రారాజుగా నిలిచింది.

దాదాపు 17 సంవత్సరాలుగా భారత పన్నుల వ్యవస్థ ఆశించిన కల ఎట్టకేలకు సాకారమైంది. ఒక దేశం ఒకే పన్ను నినాదంతో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) పట్టాలెక్కింది. శుక్రవారం అర్ధరాత్రి పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌ ఈ చరిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. దేశ చరిత్రలో అత్యంత కీలక సంస్కరణగా నిలిచిపోయే ఈ పన్నును ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించారు. ఇది ఏ ఒక్క పార్టీ, ఒక్క ప్రభుత్వం ఘనత కాదని, భవ్య భారతం కోసం సమష్టిగా చేసిన కృషి ఫలితమని ప్రధాని ఉద్ఘాటించారు. జీఎస్టీని ‘ఉత్తమమైన, సరళమైన పన్ను’గా అభివర్ణించారు. పన్నులన్నింటినీ చాపచుట్టేసి ఇకపై అంతా నేనే అంటూ నిలబడిన ఈ ‘జీఎస్టీ’ ప్రజలపై మోపే భారం ఏస్థాయిలో ఉంటుందో ఇప్పుడిప్పుడే తెలియదు కానీ దేశ చరిత్రలో నూతన శకానికి నాంది పలుకుతూ పార్లమెంట్ సాక్షిగా లాంఛనంగా ప్రారంభమైంది.
 
 
దేశ ప్రజాస్వామ్య పరిణతికి జీఎస్టీ ఓ సాధికార రూపమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. తాను ఆర్థికమంత్రిగా పనిచేసిన సమయంలో జీఎస్టీ కోసం తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య విస్తృత చర్చల తర్వాతే దీనిపై ఏకాభిప్రాయం సాధ్యమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ తదితర మిత్ర పక్షాలు కొన్ని శుక్రవారం అర్థరాత్రి పార్లమెంట్ సమావేశాలకు గైర్హాజర్ అయినప్పటికీ దేశ ఆర్థిక చరిత్రను మార్చివేయనున్న జీఎస్టీని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ప్రణబ్ ముఖర్జీ  కేంద్ర ప్రభుత్వానికి బాసటగా నిలవడం విశేషం.
 
అంతకుముందు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ జీఎస్టీ రూపకల్పనలో మైలురాళ్లు, చేకూరే లబ్ధిని వివరించారు.  ఒకజాతి కోసం ఒకే పన్నును, ఒకే మార్కెట్‌ని జీఎస్టీ సృష్టిస్తుందని అభివర్ణించారు.  కాగా, సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు రాష్ట్రపతి, ప్రధాని బటన్‌ నొక్కి జీఎస్టీని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్, తృణమూల్‌ కాంగ్రెస్, బీఎస్పీ, డీఎంకే, ఆర్జేడీ, లెఫ్ట్‌ పార్టీలు బహిష్కరించాయి. ప్రతిపక్షంలోని జేడీ(యూ), ఎన్సీపీ, బీజేడీ, సమాజ్‌వాది పార్టీ, జేడీ(ఎస్‌)లు పాల్గొనడం గమనార్హం. ఇక ఎన్డీఏ, దాని మిత్రపక్ష పార్టీలతో పాటు అమితాబ్‌ బచ్చన్, లతా మంగేష్కర్, రతన్‌ టాటా వంటి పలువురు ప్రముఖులు వేడుకలో పాల్గొన్నారు.
 
పొద్దున లేవగానే మీ చేతిలోకి వచ్చే టూత్‌పేస్ట్‌ నుంచి రాత్రి నిద్రపోయే సమయంలో తలకిందకు వచ్చే దిండు దాకా ప్రతీ వస్తువును ‘పన్ను’ కోణంలో పరిచయం చేసే నూతనోదయం!! ఒకటా రెండా... 17 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానానికి గుడ్‌బై చెప్పేస్తూ గుడ్‌మార్నింగ్‌ అంటూ ఇండియాను పలకరించిన జీఎస్టీ ఉదయం. 130 కోట్ల మంది దైనందిన జీవితాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తూ.. కోటి కోట్ల రూపాయల దేశ ఆర్థిక వ్యవస్థను శాసిస్తూ జీఎస్టీ దూసుకొచ్చేసింది.
 
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే జీఎస్టీని తీవ్రంగా వ్యతిరేకించిన నరేంద్రమోదీ తుదకు జీఎస్టీ సమర్పకుడిగా, సమర్థకుడిగా దేశం ముందు నిలబడితే జీఎస్టీని ఆద్యంతం సమర్థించిన కాంగ్రెస్ పార్టీ తన మిత్రపక్షాలతో పాటు జీఎస్టీ ప్రారంభోత్సవానికి డుమ్మా కొట్టడం మరీ విశేషం.