శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 20 ఏప్రియల్ 2017 (04:11 IST)

మోదీ చెబితే కానీ 'బుగ్గ'లకు సెలవు చెప్పరా? ఒక్క దెబ్బతో వీవీఐపీ కల్చర్ ఔట్

రయ్ రయ్ మంటూ ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా దూసుకుపోయే వీవీఐపీల దర్పం వల్ల మన దేశంలో కోటానుకోట్లమంది సామాన్యులు దశాబ్దాలుగా తీవ్రంగా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. దేశచరిత్రలో మొదటిసారి ఈ వీవీఐపీల దర్పానికి తగిన గుణపాఠం చెబుతూ కేంద్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది.

రయ్ రయ్ మంటూ ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా దూసుకుపోయే వీవీఐపీల దర్పం వల్ల మన దేశంలో కోటానుకోట్లమంది సామాన్యులు దశాబ్దాలుగా తీవ్రంగా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. దేశచరిత్రలో మొదటిసారి ఈ వీవీఐపీల దర్పానికి తగిన గుణపాఠం చెబుతూ కేంద్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. వీవీఐపీ సంస్కృతిని పక్కనపెడుతూ.. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు సహా ఇతరుల వాహనాలపై ఎర్రబుగ్గలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది. మే 1 నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్‌ నిశ్చయించింది.
 
అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలతోపాటుగా ఇతర అత్యవసర సహాయ వాహనాలకు మాత్రమే ఈ నిషేధం నుంచి మినహాయింపునిచ్చింది. ‘వీఐపీ సంస్కృతిని సూచించే అన్ని రంగుల బుగ్గలను తొలగించాలనుకుంటున్నాం.. ఇలాంటి వాటికి ప్రజాస్వామ్య దేశంలో స్థానం లేదు’ అని ప్రభుత్వం తెలిపింది. 
 
భేటీ వివరాలను కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ మీడియాకు వెల్లడించారు. ‘మే 1 తర్వాత ఎవరి వాహనాలపైనా బుగ్గలుండకూడదు. కేవలం అత్యవసర వాహనాలపైనే నీలి బుగ్గలుంటాయి. కేంద్రం గానీ, రాష్ట్రాలు గానీ ఎవరికీ ఇలాంటి బుగ్గలను వాహనాలపై పెట్టుకునేందుకు అనుమతిచ్చే అధికారం ఉండదు. దీనికెవరూ మినహాయింపు కాదు. ఎందుకంటే బుగ్గలకు సంబంధించిన నిబంధనలనే చట్టం నుంచి తొలగిస్తున్నాం’ అని జైట్లీ తెలిపారు. చాలాకాలంగా దీనిపై చర్చ జరుగుతోం దన్న కేంద్ర మంత్రి.. దీనికి అనుగుణంగా కేంద్ర మోటార్‌ వెహికల్‌ నిబంధనల్లో సవరణలు చేస్తామన్నారు. ఇప్పటికే వీఐపీ వాహనాలకు బుగ్గలు, సైరన్లు లేని విధానాన్ని ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రప్రభుత్వాలు అమలుచేస్తున్నాయి.
 
‘ప్రతి భారతీయుడూ ప్రత్యేకమే. ప్రతి ఒక్కరూ వీఐపీనే. చాలా కాలం క్రితమే ఈ బుగ్గల తొలగింపు జరగాల్సింది. నేడు గొప్ప ప్రారంభం జరిగింది. నవభారతం స్ఫూర్తిలో ఇవన్నీ సరైనవి కావు’ అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీటర్లో పేర్కొన్నారు.  కాగా, కేంద్ర కేబినెట్‌ నిర్ణయం నేపథ్యంలో తన వాహనంపై ఎర్రబుగ్గను తక్షణమే తొలగిస్తున్నట్లు మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌ స్పష్టం చేశారు. గుజరాత్‌లోనూ వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడినట్లు ఆ రాష్ట్ర సీఎం విజయ్‌ రూపానీ తెలిపారు. త్వరలోనే గుజరాత్‌ అంతటా దీన్ని అమలుచేస్తామన్నారు. గోవా సీఎం మనోహర్‌ పరీకర్, రాజస్తాన్‌ సీఎం వసుంధర రాజే, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ కూడా తక్షణమే ఎర్రబుగ్గను తొలగించాలని ఆదేశాలు జారీచేశారు.
 
అచ్చేదిన్ అంటే ఇదే అని చెప్పలేం కానీ ఇది కూడా అచ్చేదిన్‌లో భాగమే అని గర్వంగా చెప్పుకోవచ్చు. ప్రధాని నరేంద్రమోదీకి నిజంగా ధన్యవాదాలు.