లఖ్వీ విడుదలపై భద్రతా మండలిలో చర్చ : స్వాగతించిన మంత్రి కిరెన్ రిజిజు
దేశ వాణిజ్య రాజధాని ముంబైపై జరిగిన ఉగ్రదాడులకు ప్రధాన సూత్రధారి అయిన జకీవుర్ రెహ్మాన్ విడుదల అంశాన్ని భద్రతా మండలిలో చర్చించనున్నట్టు ఐక్యరాజ్య సమితి చేసిన ప్రకటనపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరెన్ రిజిజు స్వాగతించారు. ముంబై 26/11 ఉగ్రదాడుల కుట్రపన్నిన లఖ్వీని 2008 డిసెంబర్లో, 2009 నవంబర్ 25న మరో ఆరుగురిని పాకిస్ధాన్ అరెస్ట్చేసింది. ఆరోజు నుంచి జైలులో ఉన్న లఖ్వీ తదితరులను విడుదల చేయాలని ఏప్రిల్ తొమ్మిదో తేదీన పాకిస్థాన్లోని న్యాయస్థానం ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో ఏప్రిల్ 11న రావల్పిండిలోని అడియాల జైలు నుంచి విడుదలయ్యారు.
లఖ్వీని విడుదల చేయడంతో ఉగ్రవాదాన్ని అణచివేస్తామని పాకిస్ధాన్ ఇచ్చిన హామీ గాల్లో మాటలాగే ఉందని భారత్ ఆరోపించింది. జైలుల్లో ఉన్న లఖ్వీని విడుదల చేయడం అంతర్జాతీయ నిబంధనను ఉల్లంఘించడమేనని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంపై జోక్యం చేసుకోవాలని కోరుతూ యూఎన్ఎస్సీ ఆంక్షల కమిటీ ఛైర్మన్ జిమ్ మిక్లేకు ఐరాసలో భారత రాయబారి అశోక్ ముఖర్జీ లేఖరాశారు.
భారత్ ఆందోళనను పరిగణనలోకి తీసుకున్నామని, అందుకే ముంబై ఉగ్ర దాడుల సూత్రధారి జకీ ఉర్ రహ్మాన్ లఖ్వీ విడుదల అంశంపై జోక్యం చేసుకుంటామని భారత్కు ఐక్యరాజ్య సమతి భద్రతా మండలి కమిటీ హామీ ఇచ్చింది. త్వరలో యూఎన్ఎస్సీ కమిటీ నిర్వహించనున్న సమావేశంలో దీనిపై చర్చించనున్నారు.