ఇంద్రాణీ డ్రగ్స్ తీసుకోలేదు.. బలహీనత వల్లే అస్వస్థత : జైళ్ళ ఐజీ బిపిన్ సింగ్
కుమార్తె షీనా బోరా హత్య కేసులో జైల్లో ఉన్న స్టార్ ఇండియా మాజీ సీఈఓ పీటర్ ముఖర్జియా భార్య ఇంద్రాణీ ముఖర్జియా అస్వస్థతపై ముంబై ఐజీ (జైళ్ళ శాఖ) బిపిన్ సింగ్ శనివారం స్పందించారు. జైలులో ఉంటున్న ఇంద్రాణీ ముఖర్జీ ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని, కేవలం బలహీనత కారణంగానే అస్వస్థతకు గురైనట్లు వెల్లడించారు.
కాగా, గత అక్టోబర్ రెండో తేదీన ఇంద్రాణీ అస్వస్థతకు గురవడంతో ఆమెకు జేజే ఆసుపత్రిలో చికిత్స అందించిన విషయంతెలిసిందే. అయితే ఇంద్రాణీ మోతాదుకు మించిన మందులు తీసుకుందా.. లేదంటే ఆత్మహత్యకు ప్రయత్నించిందా అనే ఊహాగానాలు మొదలయ్యాయి.
ఈ విషయంపై ఐజీ బిపిన్సింగ్ వివరణ ఇచ్చారు. ఇంద్రాణీ గత కొంతకాలంగా మందులు వేసుకోవడం లేదని, మోతాదుకు మించిన మందులు తీసుకోలేదని తెలిపారు. డ్రగ్స్ లాంటివి కూడా తీసుకోలేదన్నారు. కేవలం బలహీనత కారణంగానే తన అస్వస్థతకు గురయ్యారని చెప్పుకొచ్చారు.