మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 9 మార్చి 2017 (08:56 IST)

ఈ ధర్మయుద్ధం నా కోసం కాదు.. పార్టీని కాపాడేందుకే : పన్నీర్ సెల్వం

తాను కొనసాగిస్తున్న ధర్మయుద్ధం తన కోసం కాదనీ, శశికళ కుటుంబం నుంచి శశికళను అన్నాడీఎంకేను రక్షించేందుకేనంటూ మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం ప్రకటించారు. అలాగే, తన జీవితాంతం ప్రజలకోసమే అహరహం పాటుపడిన ప

తాను కొనసాగిస్తున్న ధర్మయుద్ధం తన కోసం కాదనీ, శశికళ కుటుంబం నుంచి శశికళను అన్నాడీఎంకేను రక్షించేందుకేనంటూ మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం ప్రకటించారు. అలాగే, తన జీవితాంతం ప్రజలకోసమే అహరహం పాటుపడిన పార్టీ అధినేత్రి జయలలిత మృతిపై అనుమానాలు తొలగాలంటే న్యాయవిచారణ లేదా సీబీఐ విచారణ జరిపితీరాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. 
 
జయ మృతిపై న్యాయవిచారణ కోరుతూ మాజీ సీఎం పన్నీర్‌ సెల్వం వర్గీయులు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో నిరాహర దీక్షలు నిర్వహించారు. అలాగే, చెన్నైలో జరిగిన దీక్షలో పన్నీర్‌తో పాటు అగ్రనేతలంతా పాల్గొన్నారు. ఆ తర్వాత దీక్ష ముగియడానికి ముందుగా పన్నీర్ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తూ మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రజల కోసం సేవచేసే సామాజిక సంస్థగానే నడిపిస్తానని, తన తర్వాతి కాలంలోనూ వెయ్యేళ్లపాటు పార్టీ స్థిరంగా ఉంటుందని ఆశపడ్డారని, ఆమె ఆశలకు, ఆశయాలకు గంటి కొట్టి శశికళ కుటుంబీకులు అక్రమ పద్ధతుల్లో పార్టీని కబళించివేశారని ఆరోపించారు. 
 
2011లో జయలలిత శశికళను, ఆమె కుటుంబ సభ్యులను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించారని, ఆ సంఘటన జరిగిన నాలుగునెలల తర్వాత శశికళ జయకు క్షమాపణ లేఖ రాశారని, ఆ లేఖలో తన కుటుంబ సభ్యులు పార్టీకి వ్యతిరేకంగా కుట్రలు పన్నారని అంగీకరించారని, అలాంటి వ్యక్తులే ప్రస్తుతం పార్టీని తమ ఆధీనంలోకి తెచ్చుకుని నడపడాన్ని తాను జీర్ణించుకోలేక పోతున్నట్టు చెప్పారు. శశికళ కుటుంబ కోరల్లో చిక్కుకున్న పార్టీని కాపాడేందుకే తాను తిరుగుబాటు చేశానని ప్రకటించారు. 
 
అమ్మకు ప్రాణాంతకమైన వ్యాధులేవీ లేవని చెబుతూనే ప్రతిరోజూ ఏదో ఒక ప్రత్యేక చికిత్స జరిపినట్టు చెబుతుండేవారని, ఏమి జరుగుతున్నదో అర్థంకాని పరిస్థితిలో తామంతా కలిసి ఆమెను అమెరికా లేదా లండన్ ఆస్పత్రికి తీసుకెళ్లి కాపాడుకుందామని కాళ్లావేళ్లా వేడుకున్నా పట్టించుకోలేదన్నారు. జయ మృతిపై న్యాయవిచారణకు ఆదేశిస్తే తానే (పన్నీర్‌సెల్వం) మొదటి నిందితుడవుతానని మంత్రి విజయభాస్కర్ విమర్శించటం విడ్డూరంగా ఉందని, న్యాయవిచారణ కావాలని డిమాండ్‌ చేస్తున్నది తామేనని, దమ్ముంటే.. ధైర్యముంటే న్యాయ విచారణకు ఆదేశించాలని పన్నీర్ సెల్వం పిలుపునిచ్చారు.