లక్ష్యం దిశగా చేరుకుంటున్న జిశాట్ - 6 ప్రయాణం : ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఇటీవల జీశాట్ 6ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రక్రియలో తొలి అంకాన్ని విజయవంతంగా పూర్తిచేసినట్టు ఇస్రో ప్రకటించింది. అనంతరం జీశాట్-6 ఉపగ్రహం కర్ణాటకలోని హసన్ కేంద్రంలోని మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటి (ఎంసీఎఫ్) నియంత్రణ పరిధిలోకి వచ్చింది. దీంతో ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు దశలవారీ ప్రయత్నాలను చేపట్టేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు.
ఇందులో భాగంగా.. శనివారం నాడు అపోజీ మోటార్ను సుమారు గంట పాటు మండించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. తాజా ప్రయోగంతో జీశాట్ భూమధ్య రేఖకు 7.5 డిగ్రీల వాలులో 8,408 కిలోమీటర్ల దగ్గరగా (పెరిజీ).. 35,708 కిలోమీటర్ల దూరంగా(అపోజీ) వృత్తాకార కక్ష్యలోకి చేరిందన్నారు. ఈ ఉపగ్రహాన్ని 36 వేల కిలోమీటర్ల వృత్తాకార భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.