నింగికెగసిన జీఎస్ఎల్వీ మార్క్-3.. టార్గెట్ సక్సెస్...!
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగం విజయవంతమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జీఎస్ఎల్వీ మార్క్-3 గురువారం ఉదయం 9:30 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. అనుకున్న లక్ష్యాన్ని ఛేదించేందుకు 20 నిమిషాలు పడుతుంది.
ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ... ఇది కేవలం ప్రయోగాత్మకమైనదేనన్నారు. రాకెట్ పైభాగంలో 3,735 కిలోల క్రూమాడ్యూల్ (వ్యోమగాముల గది)ని 126 కిలోమీటర్ల ఎత్తున అంతరిక్షంలో ప్రవేశపెట్టిందన్నారు.
కాగా ఈ ప్రయోగం కోసం ఇస్రో దాదాపు 155 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఈ రాకెట్ ఎత్తు 43.43 మీటర్లు, బరువు 630.58 టన్నులు. ఈ ప్రయోగం ద్వారా మనుషులను అంతరిక్షంలోకి పంపే ప్రక్రియలో ఇస్రో మరో మెరుగైన ముందడుగు వేసింది. రాకెట్ ప్రయోగం విజయవంతంపై ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్, శాస్త్రవేత్తలు ఉత్సాహంగా ఉత్సవం జరుపుకున్నారు.