హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ఎందుకు చేయలేదంటే : జైరాం రమేష్ వివరణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనివార్యమని తేలిపోవడంతో సీమాంధ్ర నేతలంతా హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని పట్టుబట్టగా, కాంగ్రెస్ అధిష్టానం అందుకు అంగీకరించక పోవడానికి కారణాలు లేకపోలేదని విభజన చట్ట
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనివార్యమని తేలిపోవడంతో సీమాంధ్ర నేతలంతా హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని పట్టుబట్టగా, కాంగ్రెస్ అధిష్టానం అందుకు అంగీకరించక పోవడానికి కారణాలు లేకపోలేదని విభజన చట్ట రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జైరాం రమేష్ తాజాగా వివరణ ఇచ్చారు. ఆయన తాజాగా 'ఓల్డ్ హిస్టరీ-న్యూ బయోగ్రఫీ' (పాత సంగతులు-కొత్త సరిహద్దులు) పేరిట రాష్ట్ర విభజనపై పుస్తకం రచించారు. ఇందులో అన్ని అంశాలను పేర్కొన్నారు.
ముఖ్యంగా, హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలన్న సీమాంధ్ర నేతల డిమాండ్ను నాటి యూపీఏ ప్రభుత్వం ఎందుకు తిరస్కరించాల్సి వచ్చిందో ఆ పుస్తకంలో వివరించారు. తెలంగాణ సంస్కృతి-వారసత్వం హైదరాబాద్తోనే ముడిపడి ఉంది. ఇదేసమయంలో భూముల అందుబాటు, ఇతర అంశాలవల్ల హైదరాబాద్లో 1950 దశకం మధ్య నుంచే పెట్టుబడులు పెరిగాయి. సినీ పరిశ్రమ కూడా ఇక్కడే స్థిరపడిపోయింది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హయాంలో 1996-2003 మధ్య హైదరాబాద్ నగరం బాగా అభివృద్ధి జరిగింది. తర్వాత.. వైఎస్ కూడా ఈ అభివృద్దిని కొనసాగించారు. ఉమ్మడి ఏపీకి హెచ్ఎండీఏ ప్రాంతాలు ఆర్థిక వనరుగా మారాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలో హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలన్న డిమాండ్ సీమాంధ్ర నుంచి వచ్చింది. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ కూడా ఈ అంశంపై సమీక్షించింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 2013 జూలైలో కొత్త కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేయరాదని నిర్ణయించింది. అందుకే సీమాంధ్ర నేతల ప్రతిపాదనను తిరస్కరించినట్టు చెప్పారు.