శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 18 ఏప్రియల్ 2015 (11:01 IST)

నేడు జమ్మూకాశ్మీర్ బంద్... ఓ కంట కనిపెట్టాం : జితేంద్ర సింగ్

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో తీవ్రవాదాన్ని, వేర్పాటువాదాన్ని ఏమాత్రం సహించేంది లేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. మస్రత్ ఆలంను అరెస్టు చేసిన సందర్భంగా తలెత్తిన ఆందోళనలపై ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిస్థితులను కేంద్రం ఎప్పటికప్పుడు పరిశీలిస్తుందని అన్నారు. పీడీపీ-బీజేపీ సిద్ధాంతాలు వేరైనప్పటికీ, ప్రభుత్వం ఏర్పాటు చేశాయని, సుపరిపాలన ముఖ్యమని ఆయన చెప్పారు. సుపరిపాలన అందిస్తూనే, వేర్పాటు వాదాన్ని సహించేది లేదని ఆయన పేర్కొన్నారు. 
 
మరోవైపు.. జమ్మూ కాశ్మీర్‌లో వేర్పాటు వాదులు పేట్రేగిపోతున్నారు. మస్రత్ ఆలంను విడుదల చేయడంతో రాజుకున్న వివాదం కేంద్రానికి కునుకులేకుండా చేస్తోంది. బీజేపీతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీడీపీ, తన ఎన్నికల హామీని నెరవేర్చేందుకు, అధికారంలోకి రాగానే మస్రత్ ఆలంను విడుదల చేసి, ఇప్పుడు దాని పర్యవసానాలు అనుభవిస్తోంది. ఇప్పుడు మళ్లీ మస్రత్ ఆలంను అరెస్టు చేయడంతో వేర్పాటు వాదులు ఏకమయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
 
గతంలో జమ్మూకాశ్మీర్లో కనిపించిన దృశ్యాలు, మళ్లీ రోడ్లపై చేస్తున్నాయి. మస్రత్ ఆలంను అరెస్టు చేసినందుకు నిరసనగా, వేర్పాటువాదులు నేడు జమ్మూకాశ్మీర్ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు పహారా కాస్తున్నాయి. బంద్ ను విజయవంతం చేసేందుకు వేర్పాటు వాదులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.