గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 14 డిశెంబరు 2016 (09:27 IST)

జయలలితకు రెండోసారి అంత్యక్రియలు.. ఖననం చేయడం తప్పన్న బంధువులు.. శ్రీరంగంలో?

సెప్టెంబర్ 22న చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత డిసెంబర్ 5న రాత్రి 11గంటల ప్రాంతంలో కన్ను మూసిన విషయం తెలిసిందే. డిసెంబర్ ఆరో తేదీన ఆమెకు భౌతికకాయానికి అంత్యక్రియలు జరిగిన

సెప్టెంబర్ 22న చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత డిసెంబర్ 5న రాత్రి 11గంటల ప్రాంతంలో కన్ను మూసిన విషయం తెలిసిందే. డిసెంబర్ ఆరో తేదీన ఆమెకు భౌతికకాయానికి అంత్యక్రియలు జరిగిన సంగతి తెలిసిందే. మెరీనా తీరంలో అమ్మకంటూ సమాధి ఏర్పాటు చేసి అక్కడ ఆమె అంత్యక్రియలను పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో అమ్మకు రెండోసారి అంత్యక్రియలు నిర్వహించారు. జయలలిత మృతదేహాన్ని ఖననం చేసిన తీరుపై మైసూరు, మేలుకోటె నగరాల్లో ఉండే జయ మేనల్లుళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. వాళ్లు కూడా తాజాగా నిర్వహించిన అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
 
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ఆమె బంధువులు పవిత్ర నగరం శ్రీరంగపట్నంలో కావేరీ నదీ ఒడ్డున పశ్చిమవాహినిలో మళ్లీ అంత్యక్రియలు నిర్వహించారు. హిందూ ఆచారాల ప్రకారం ఆమెను దహనం చేయకుండా ఖననం చేసినందున ఆమె ఆత్మకు మోక్షం లభించదని, అందుకే తాము మళ్లీ ఈ అంత్యక్రియలు చేస్తున్నామని తెలిపారు. ప్రధాన పూజారి రంగనాథ్ అయ్యంగార్ జయలలిత రూపానికి ప్రతిరూపంగా ఉండేలా ఒక బొమ్మను చేయించి, దానికి అంత్యక్రియలు చేయించారు. 
 
రాబోయే ఐదు రోజుల పాటు ఆమె ఆత్మశాంతి కోసం మరికొన్ని కార్యక్రమాలు చేయించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. జయలలితకు సోదరుడి వరసయ్యే వరదరాజు ఈ అంత్యక్రియలను దగ్గరుండి చేయించారు. తన సోదరి నాస్తికురాలు అయి ఉంటే ఆమె ఆలయాలకు వెళ్లేది కాదని, హిందూ ఉత్సవాల్లో పాల్గొనేది కాదని, అలాగే హిందూ సంప్రదాయాలను పాటించేది కాదని చెప్పారు. అసలు ఆమెను ఖననం చేయాలన్న నిర్ణయాన్ని పార్టీ ఎలా తీసుకుంటుందని వరదరాజు ప్రశ్నించారు. తామందరినీ అంత్యక్రియల నుంచి ఎందుకు దూరంగా పెట్టారని నిలదీశారు.
 
జయలలిత డిసెంబర్ ఐదోతేదీ రాత్రి మరణించగా, ఆరోతేదీన ఆమెను ఖననం చేయగానే.. ఆమె అంత్యక్రియలను హిందూ మతాచారాల ప్రకారం చేయలేదన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. జయలలిత హిందూ ఆచారాలను గట్టిగా పాటిస్తారని, అందువల్ల అయ్యంగార్ ఆచారాల ప్రకారం అంత్యక్రియలు చేసి ఉండాల్సిందని కొంతమంది బంధువులు అన్నారు.