శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 27 ఏప్రియల్ 2015 (15:18 IST)

జయలలిత కేసులో సుప్రీం తీర్పు : స్వాగతించిన కరుణానిధి!

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు తీర్పు ఇవ్వొచ్చంటూ సోమవారం సుప్రీంకోర్టు చెప్పడంపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి స్వాగతించారు. 
 
న్యాయం, నిజాయతీ ఎప్పటికైనా గెలుస్తాయని మరోసారి రుజువైందని మీడియాతో అన్నారు. అయితే ఈ కేసు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపుతుందా? అని ప్రశ్నించగా, ఇప్పుడే తాము ఎన్నికల లెక్కలు వేసుకోవడంలేదన్నారు. ఈ తీర్పు తమ పార్టీకి పెద్ద విజయమని కరుణ పేర్కొన్నారు.
 
కాగా, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అక్రమాస్తుల కేసులో తుది తీర్పును వెలువరించేందుకు కర్ణాటక ప్రభుత్వానికి అపెక్స్ కోర్టు అనుమతిచ్చింది. 
 
అదేసమయంలో ఈ కేసులో ప్రాసిక్యూటర్ నియామకంతో సంబంధం లేకుండా తీర్పు ఇవ్వాలని ముగ్గురు జడ్జిల నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. ఈ మేరకు కేసులో కర్ణాటక హైకోర్టు తీర్పుపై విధించిన స్టేను సుప్రీం ఎత్తివేసింది. కేసులో ఇంతవరకు జరిగిన వాదనలు చాలని, కొత్తగా వాదనలు వినాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఆ వాదనలతోనే తీర్పు వెల్లడించవచ్చని ఆదేశించింది. 
 
కాగా కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను నియమించాల్సిన అవసరం తమిళనాడు ప్రభుత్వానికి లేదని చెప్పింది. అంతేగాక ఆయన ద్వారా కర్ణాటక హైకోర్టులో జయ కేసుపై తాజా వాదనలు వినాల్సిన అవసరం కూడా లేదని పేర్కొంది. భవానీ సింగ్ అనే వ్యక్తిని ప్రాసిక్యూటర్ గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ డీఎంకే నేత అన్బగన్ వేసిన పిటిషన్ పై ఈరోజు సుప్రీం తుది నిర్ణయాన్ని వెల్లడించింది.