నా ఆస్పత్రి ఫోటోలను విడుదల చేయకండి.. జయలలిత అమ్మే అపోలోకు చెప్పిందట..?!
అపోలో ఆస్పత్రిలో 75 రోజుల పాటు చికిత్స పొందుతూ మరణించిన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అమ్మ మరణంపై పలు అనుమానాలున్నాయని.. ఆమె మృతికి తర్వాత ఎందరో
అపోలో ఆస్పత్రిలో 75 రోజుల పాటు చికిత్స పొందుతూ మరణించిన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అమ్మ మరణంపై పలు అనుమానాలున్నాయని.. ఆమె మృతికి తర్వాత ఎందరో కోర్టులను ఆశ్రయిస్తున్నారు. అమ్మకు అపోలో ఆస్పత్రి ఇచ్చిన చికిత్సపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు అందించిన చికిత్స ఫోటోలు ఎందుకు విడుదల చేయలేదో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో జయలలిత మృతిపై పలు సందేహాలున్నాయంటూ న్యాయస్థానంలో జోసెఫ్ అనే వ్యక్తి పిటిషన్ వేసిన నేపథ్యంలో హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు అపోలో ఆసుపత్రికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు గురువారం మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా అపోలో తరపు న్యాయవాదులు కోర్టుకు అమ్మ ఫోటోలను ఎందుకు విడుదల చేయలేదో వివరణ ఇచ్చారు. అపోలో ఆస్పత్రి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసి.. చికిత్స పొందుతున్న వ్యక్తికి సంబంధించిన గోప్యతపై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కొన్ని నిబంధనలను విధించిందని తెలిపింది.
తాము ఆ నిబంధనలను అనుసరించే జయమ్మకు అందించిన చికిత్స వివరాలను బహిర్గతం చేయలేదని.. అపోలో పేర్కొంది. చివరికి జయలలిత ఆరోగ్యానికి సంబంధించిన పత్రికా ప్రకటనలను కూడా ఆమె అనుమతితోనే విడుదల చేసినట్లు పేర్కొంది. తన ఫొటోలను విడుదల చెయ్యరాదంటూ జయలలిత తమను స్వయంగా కోరారని, అందువల్లే వాటిని విడుదల చేయలేదని పేర్కొంది. అమ్మకు సరైన చికిత్స అందించినట్లు అపోలో తెలిపింది.
అయితే, దీనికి పిటిషనర్ అభ్యంతరం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వ అఫిడవిట్, అపోలో అఫిడవిట్ ఒకేలా ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. కాగా, కేంద్ర ప్రభుత్వ న్యాయవాది మాత్రం జయలలిత మృతిపై ఎటువంటి వివరణ ఇవ్వలేదు. తమకు మరో రెండు వారాల సమయం కావాలని కోరారు. దీంతో ఈ పిటిషన్పై విచారణను హైకోర్టు వచ్చేనెల 13 వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.