గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 13 డిశెంబరు 2016 (17:01 IST)

అమ్మ స్మారక మందిరంగా పోయెస్ గార్డెన్: శశికళ అవుట్.. వార్ధాకు జయ సమాధి ఏమైంది?

తమిళనాడు దివంగత సీఎం జయలలిత నివసించిన పోయెస్ గార్డెన్ నుంచి ఆమె నెచ్చెలి శశికళ బయటికి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. జయలలిత మరణానికి అనంతరం శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించాలని అన్

తమిళనాడు దివంగత సీఎం జయలలిత నివసించిన పోయెస్ గార్డెన్ నుంచి ఆమె నెచ్చెలి శశికళ బయటికి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. జయలలిత మరణానికి అనంతరం శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించాలని అన్నాడీఎంకే సీనియర్లు పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు సీఎం పన్నీర్ సెల్వంతో పాటు పార్టీ సీనియర్లు, మంత్రులు కూడా వత్తాసు పలుకుతున్నారు. 
 
అయితే అన్నాడీఎంకేకు చెందిన కార్యకర్తలు మాత్రం శశికళకు పార్టీ పగ్గాలు అప్పగించకూడదని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ఫలితంగా అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు శశికళకు అప్పగిస్తున్నట్లు వెలసిన బోర్డింగ్‌లు, హోర్డింగులను అన్నాడీఎంకే కార్యకర్తలు తొలగించి తమ వ్యతిరేకతను వెల్లగక్కారు. ఇంకా శశికళ వ్యతిరేకంగా ర్యాలీలు కూడా చేపట్టారు. దీంతో శశికళ పార్టీ పగ్గాలను ప్రస్తుతం చేపట్టడం సబబు కాదని.. సెలైంట్ అయిపోయారు. అంతటితో ఆగకుండా రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా పోయెస్ గార్డెన్‌ను టార్గెట్ చేశారు. 
 
పోయెస్ గార్డెన్‌కు వచ్చే ప్రజలు, అన్నాడీఎంకే కార్యకర్తలను ఓదార్చారు. ఇంకా తన కుటుంబీకులను పోయెస్ గార్డెన్ నుంచి వెళ్ళిపోవాల్సిందిగా సూచించారు. అంతేగాకుండా.. జయలలిత పోయెస్ గార్డెన్‌ను అమ్మ స్మారక మందిరంగా మార్చాలని నిర్ణయించారు. ఫలితంగా పోయెస్ గార్డెన్ నుంచి తాను కూడా బయటికి వచ్చేయాలని డిసైడై పోయారు. ఇలా చేయడం ద్వారా శశికళపై కార్యకర్తలకు కోపం తగ్గుతుందని ఆమె భావిస్తున్నారు.
 
ఇదిలా ఉంటే.. వార్ధా తుఫాను ధాటికి చెన్నైకి అతలాకుతలమైంది. చెట్లు, మహావృక్షాలు నేలకూలడంతో రవాణా రాకపోకలు స్తంభించాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
ఈ నేపథ్యంలో దివంగత సీఎం జయలలిత సమాధి వార్ధా ధాటికి ఏమైందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే చెన్నై మెరీనా తీరంలోని అమ్మ సమాధికి పైకప్పు వేయబడింది. కానీ వార్ధా ధాటికి జయమ్మ సమాధి ఏమీ కాలేదని అన్నాడీఎంకే కార్యకర్తలు అంటున్నారు. 
 
జయలలిత తరహాలోనే ఆమె సమాధికి పైన వేయబడిన పైకప్పు కూడా వార్ధా తుఫానును లెక్కచేయకుండా గంభీరంగా నిలిచిందని వారు చెప్తున్నారు. జయలలిత సమాధి చుట్టూ ఇసుక బస్తాలను పోలీసులు ఉంచారని.. దీంతో సమాధి వద్దకు వర్షపు నీరు చేరుకోలేదని.. అయితే పైకప్పు ఏమాత్రం వార్ధా ధాటికి కిందపడలేదని వారు చెప్తున్నారు.