శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 17 జనవరి 2017 (11:48 IST)

రాజకీయాల్లోకి వచ్చేశా.. రాష్ట్రమంతా పర్యటిస్తా.. శశికళ కంటిలో నలుసుగా మారిన దీప..?

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి అనంతరం అన్నాడీఎంకే పార్టీ నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒక వర్గం వారు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు మద్దతు తెలుపగా, మరొక వర్గం వారు జయలలిత సన్నిహితురాలు శశికళ వ

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి అనంతరం అన్నాడీఎంకే పార్టీ నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒక వర్గం వారు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు మద్దతు తెలుపగా, మరొక వర్గం వారు జయలలిత సన్నిహితురాలు శశికళ వైపు మొగ్గు చూపారు.

పార్టీలో నెలకొన్న ఈ గందరగోళ పరిస్థితుల మధ్యే శశికళ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టారు. ఇది ఇష్టం లేని కొందరు అన్నాడీఎంకే నాయకులూ, కార్యకర్తలు జయలలిత మేనకోడలు దీపను శశికళను పోటీగా రాజకీయాలలోకి రావాలని కోరుతున్నారు. దానికి ఆమె కూడా సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.
 
ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్న ద్వితీయ శ్రేణి మొదలుకుని కింది స్థాయి కార్యకర్త వరకు అధిక శాతం లోలోన దీప వైపు మొగ్గు చూపుతున్నారు. రాజకీయాల్లో అమ్మ లేని లోటును తీర్చాలంటూ దీపపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో చెన్నై టీనగర్‌లోని దీప ఇంటి పరిసరాలు అభిమానుల నినాదాలతో మార్మోగుతు న్నాయి. ప్రతిరోజు తండో పతండాలుగా వస్తున్న జనాన్ని దీప కలుసుకుంటున్నారు. సమయం వచ్చినపుడు రాజకీయ ప్రవేశం ఖాయమని నచ్చజెబుతూ వచ్చారు. 
 
ఇప్పటికే చాలామంది దీప మద్దతుదారులు 'దీపా పేరవై' అనే సంస్థను స్థాపించి సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా చేపట్టారు. అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ శత జయంతి ఉత్సవాల ప్రారంభదినమైన ఈ నెల 17వ తేదీన తాను రాజకీయాల్లోకి అరంగేట్రం చేయబోతున్నామని దీప కూడా ప్రకటించారు. దీంతో తమిళనాడు ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 
 
ఆమె ప్రతి అడుగు అన్నాడీఎంకేలోని శశికళ వర్గం వారు గమనిస్తూనే ఉన్నారు. ఆమెకు కౌంటర్ ఇవ్వడానికి వారంతా సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన దీప తన పేరుతో వెలసిన పేరవైలో అన్నాడీఎంకే కార్యకర్తలు చేరుతారా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
 
ఇక తమిళనాడులో దీపకు మద్దతుగా పలు సంఘాలు ఏర్పడుతున్నాయి. జయలలిత ప్రాతినిధ్యం వహించిన శ్రీరంగంలో 'జయ-దీప పెరవై' పేరిట ఓ యువసేన ఏర్పాటైంది. దీనిలో దాదాపు 10 లక్షల మంది సభ్యులున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తన రాజకీయపు తొలి అడుగులను దీప ఎలా వేయనున్నారన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
 
ఇదిలా ఉంటే.. తాను తమిళ రాజకీయాల్లోకి వచ్చేసినట్టేనని, ఇక భవిష్యత్ కార్యాచరణను నేడో రేపో వెల్లడిస్తానని జయలలిత మేనకోడలు దీప వెల్లడించారు. ఈ మంగళవారం ఉదయం చెన్నైలోని మెరీనా బీచ్‌లో ఎంజీఆర్ శతజయంతి వేడుకలు జరుగుతుండగా, భారీ సంఖ్యలో మద్దతుదారులను వెంటబెట్టుకుని వచ్చిన దీప, ఎంజీఆర్‌కు నివాళులు అర్పించారు. అదే సమయంలో శశికళ వర్గీయులు సైతం పెద్దఎత్తున అక్కడికి చేరుకోవడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. ఇరు వర్గాల మధ్యా పోటాపోటీ ప్రదర్శనలు జరిగాయి. నినాదాలు హోరెత్తాయి. 
 
దీప వెంట ఉన్న అన్నాడీఎంకే కార్యకర్తలు వుండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సందర్భంగా దీప మాట్లాడుతూ, త్వరలోనే రాష్ట్రమంతటా పర్యటిస్తానని, అన్నాడీఎంకే పార్టీలోని ప్రతి కార్యకర్తనూ, ప్రజలను కలుస్తానని చెప్పుకొచ్చారు. దీప ప్రజల్లోకి వెళితే బాగా పాపులర్ అయిపోతుందని.. ఆపై అమ్మ స్థానాన్ని భర్తీ చేసే స్థాయికి ఎదిగిపోతుందని రాజకీయ విశ్లేషకులు జోస్యం చెప్తున్నారు.