శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 30 సెప్టెంబరు 2014 (12:57 IST)

జైల్లోనే జయలలిత : అక్టోబర్ 6కు విచారణ వాయిదా!

అక్రమాస్తుల కేసులో జైల్లో ఉన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అక్టోబర్ ఆరో తేదీ వరకు జైల్లోనే గడపాల్సిన వుంది. ఆమె బెయిల్ కోసం పెట్టుకున్న పిటీషన్‌ను అడ్మిట్‌ చేసుకున్న కర్ణాటక హైకోర్టు.. విచారణను అక్టోబర్ 6వ తేదీకి వాయిదా వేసింది. దీంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. హైకోర్టు తీర్పుతో అన్నాడీఎంకే శ్రేణులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. కాగా, జయలలిత తరపున ప్రముఖ క్రిమినల్ న్యాయవాది రాంజెఠ్మలానీ కోర్టుకు హాజరై వాదించారు. 
 
ఈ సందర్భంగా ఆయన వాదిస్తూ.. ప్రత్యేక కోర్టు తీర్పును సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. జయలలిత అనారోగ్యం దృష్ట్యా ఆమెను తక్షణం బెయిలుపై విడుదల చేయాలని కోరారు. ఇరు వర్గాల వాదోపవాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను అక్టోబర్ 6వ తేదీ వరకూ వాయిదా వేసింది. దాంతో జయ సోమవారం వరకూ జైల్లోనే ఉండాలి. 
 
మరోవైపు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడటంతో పార్టీ కార్యకర్తలు నిరాశ చెందారు. సోమవారం తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొత్త సీఎం పన్నీర్ సెల్వం, మరికొంతమంది మంత్రులు కూడా బెంగుళూరులో ఉన్నారు. కాగా, ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై సీబీఐ ప్రత్యేక కోర్టు శనివారం జయలలితకు నాలుగేళ్ల జైలు శిక్ష, వందకోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. జయతో పాటు జైలు శిక్షకు గురైన శశికళ, సుధాకరన్, ఇళవరసిలు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.