గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 20 జులై 2018 (16:22 IST)

సోనియా ఎదురుపడితే జేసీ ఏమన్నారో తెలుసా? రాజీనామా చేసేస్తారా?

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి టీడీపీ ఎంపీ జేసీ ఎదురుపడ్డారు. పార్లమెంట్‌లో ఈ నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. దీంతో తన ఆవేదనను జేసీ.. సోనియా ముందుంచారు. ఈ సందర్భంలో జేసీ సోనియా గాంధీతో కీలక

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి టీడీపీ ఎంపీ జేసీ ఎదురుపడ్డారు. పార్లమెంట్‌లో ఈ నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. దీంతో తన ఆవేదనను జేసీ.. సోనియా ముందుంచారు. ఈ సందర్భంలో జేసీ సోనియా గాంధీతో కీలక వ్యాఖ్యలు చేశారు. "తల్లీ రాష్ట్రాన్ని విభజించావ్.. రెడ్లకు తీరని అన్యాయం చేశావ్.. కాంగ్రెస్‌ను నమ్ముకొని తెలుగు రాష్ట్రాల్లో రెడ్లు నిలువునా మునిగారు'' అంటూ సోనియాకు జేసీ దండం పెట్టారు.
 
జేసీ వ్యాఖ్యలు విన్న సోనియా నవ్వుతూ ముందుకెళ్లారు. జేసీ గతంలో కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా కొనసాగారు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్‌లో మనుగడ కష్టమని భావించి.. 2014ఎన్నికల ముందు టీడీపీలో చేరి ఎంపీగా గెలిచిన సంగతి తెలిసిందే.
 
ఇదిలా ఉంటే.. అవిశ్వాసంపై ఓటింగ్‌కు దూరంగా ఉంటానని కలకలం రేపి జేసీ దివాకర్ రెడ్డి ఎట్టకేలకు అలక వీడారు. చంద్రబాబు ఫోన్ చేసిన తర్వాత మెత్తబడిన జేసీ శుక్రవారం లోక్‌సభకు హాజరయ్యారు. అనంతపురం గ్రూపు రాజకీయాల వల్లే జేసీ టీడీపీ హైకమాండ్‌కు ఝలక్ ఇచ్చినట్లు సమాచారం. అయితే అవి‌‌శ్వాసం ఓటింగ్ తర్వాత ఏం జరుగుతుందో చూడండంటూ జేసీ సస్పెన్స్ మిగిల్చారు. 
 
అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరే ప్రార్థనామందిరాల కమిటీలను కోర్టుకు పంపించారని ఆరోపిస్తున్న జేసీ దివాకర్‌రెడ్డి అలకపాన్పు ఎక్కారు. అంతేకాదు ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని సన్నిహితులకు చెప్పారు. దీంతో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని చంద్రబాబు అమరావతికి పిలిపించుకొని మాట్లాడారు. జేసీతో మనస్పర్థలు ఉంటే సర్దుకుపోవాలని చెప్పారు. 
 
అంతేకాదు.. జేసీ కోరుతున్నట్లు అనంతపురంలో రహదారుల విస్తరణకు ప్రభుత్వం వెంటనే జీవో ఇచ్చింది. దీంతో ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి అలక వీడినట్టు సమాచారం. అయితే అవిశ్వాస తీర్మానానికి ఓటేసిన తర్వాత జేసీ టీడీపీకి రాజీనామా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.