గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 1 జులై 2016 (11:21 IST)

కుమారుడికి 11 యేళ్ళ బాలికతో ఘనంగా పెళ్లి చేయించిన జార్ఖండ్ బీజేపీ చీఫ్!

జార్ఖండ్ బీజేపీ చీఫ్ త‌లా మ‌రాండీ వివాదంలో చిక్కుకున్నారు. కేంద్రంలో అధికారం చెలాయిస్తోన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పెను వివాదంలో చిక్కుకుంది. కమలం పార్టీకి చెందిన జార్ఖండ్ శాఖ చీఫ్ తలా మరాండీ చేసి

జార్ఖండ్ బీజేపీ చీఫ్ త‌లా మ‌రాండీ వివాదంలో చిక్కుకున్నారు. కేంద్రంలో అధికారం చెలాయిస్తోన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పెను వివాదంలో చిక్కుకుంది. కమలం పార్టీకి చెందిన జార్ఖండ్ శాఖ చీఫ్ తలా మరాండీ చేసిన ఈ పని ఆ పార్టీకి మచ్చ తెచ్చింది. ఈయన చేసిన పని సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ముక్కుపచ్చలారని 11 ఏళ్ల బాలికతో ఆయన తన కొడుకు మున్నా మరాండీకి వివాహం చేశారు.

జూన్ 27న జ‌రిగిన ఈ వివాహం జ‌రుగ‌గా.. 29న రిసెప్షెన్‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ బాలిక వయస్సును పరిశీలించగా.. 2005, జూలై 25న ఆ బాలిక జన్మించిందని స్కూల్ రికార్డులలో తేలింది. అంతేకాదు మరోపక్క 11 ఏళ్ల బాలిక బంధువును మున్నాను వివాహం చేసుకోవాల్సిఉండ‌గా.. చివ‌రి నిమిషంలో ఏమైందో ఏమోగాని ఉన్నట్టుండి ఏకంగా పెళ్లి కూతురునే మార్చేశాడు. 
 
అంత‌కుముందు ఓ 16 ఏళ్ల బాలిక‌ను మున్నా మ‌రాండి రెండేళ్లుగా లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆ బాలిక రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ ఎదుట ఫిర్యాదు చేసింది. మ‌హాగ‌మ ప్రాంతానికి చెందిన భ‌గ‌న్ బ‌స్కీ నాల్గ‌వ కుమార్తెను మ‌రాండీ వివాహం చేసుకున్నాడ‌ని జిల్లా శిశు సంక్షేమ అధికారి రితేష్ కుమార్ వెల్ల‌డించాడు. 
 
ఓ వైపు ''మోడీ బేటీ బ‌చావో..బేటీ ప‌డావో'' మంత్రాన్ని చెబుతుంటే.. ఇలా బీజేపీ నేత‌లు మైన‌ర్ బాలిక‌ల‌ను వివాహం చేసుకుంటున్నార‌ని కాంగ్రెస్ నాయ‌కురాలు శోభా ఓజా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బీజేపీ ప్ర‌భుత్వంలో ఆడ‌పిల్ల‌ల‌కు, మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేద‌ని కాంగ్రెస్ నేతలు మండిప‌డుతున్నారు. ఈ ఘ‌ట‌న‌పై స‌త్వ‌ర‌మే విచార‌ణ జ‌రిపి నిందితుల‌కు క‌ఠిన శిక్ష విధించాల‌ని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. జాతీయ మ‌హిళా క‌మిష‌న్ ఈ వ్య‌వ‌హారంలో క‌ల‌గ‌జేసుకోవాల‌ని శోభా ఓజా కోరారు.