గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 22 ఆగస్టు 2014 (13:48 IST)

మోడీతో వేదిక పంచుకోను.. ఇది అత్యాచారానికి తెగబడడం వంటిదే!

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభలో పాల్గొన్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు గురువారం చేదు అనుభవం ఎదురయింది. ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌ చవాన్‌, హర్యానా ముఖ్యమంత్రి భూపేందర్‌ సింగ్‌ హుడాలకు చేదు అనుభవం ఎదురయింది. 
 
తాజాగా జార్ఖండ్‌ ముఖ్యమంత్రికి కూడా ఇదే పరిస్థితి తప్పలేదు. మోడీతోపాటు బహిరంగ సభల్లో పాల్గొన్న బీజేపీయేతర ముఖ్యమంత్రులకు ఇబ్బందులు తప్పటం లేదు. రాంచీలో గురువారం జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. 
 
ప్రొటోకాల్‌ ప్రకారం సీఎం సోరెన్‌ కూడా మోడీతోపాటు ఉన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ సభలో ముఖ్యమంత్రి సోరెన్‌ మాట్లాడడం ప్రారంభించినప్పుడు సభికులు నిరసన వ్యక్తం చేశారు. మోడీ మోడీ అంటూ నినాదాలు చేశారు. 
 
వారి నినాదాల మధ్యే ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని కొనసాగించారు. గొడవ చేయవద్దంటూ మోడీ సైగలు చేసి చెప్పినా ఆయన అభిమానులు వినిపించుకోలేదు. ఇప్పటికే మహారాష్ట్ర, హర్యానా సీఎంలకు కూడా ఇదే తరహా అనుభవం ఎదురైంది. దీంతో మోడీతోపాటు ఇంకెప్పుడూ వేదిక పంచుకోనని హర్యానా సీఎం హుడా తేల్చి చెప్పారు. 
 
మహారాష్ట్ర సీఎం చవాన్‌ కూడా ఇదే బాటలో నడుస్తున్నారు. నాగ్‌పూర్‌లో మోడీ హాజరయ్యే ఓ కార్యక్రమానికి ఆయన దూరంగా ఉన్నారు. కాగా మోడీ సమక్షంలోనే తనకు అవమానం జరగడాన్ని జార్ఖండ్‌ సీఎం సోరెన్‌ తప్పుపట్టారు.
 
ఇది అత్యాచారానికి తెగబడడం వంటిదేనని, ఇటువంటి చర్యలతో కేంద్ర రాష్ట్ర సంబంధాలు మరింత బలహీనపడతాయని, అధికారంలో ఉండి రాజకీయాలు చేస్తున్నారని, దీన్ని సహించలేమని, దేశమంతా దీన్ని గమనిస్తోందన్నారు. 
 
బీజేపీ కార్యకర్తల వ్యవహార శైలి తనను చాలా బాధించిందని హేమంత్‌ సోరెన్‌ వ్యాఖ్యానించారు. కాగా తమ ముఖ్యమంత్రుల నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ సమర్థించుకుంది. ముఖ్యమంత్రులను మోడీ సమక్షంలోనే అవహేళన చేస్తున్నారని దీని వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించింది. సమాఖ్య విధానం గురించి తరచు ఉపన్యాసాలిచ్చే మోడీ తన సమక్షంలోనే సమాఖ్య విధానానికి తూట్లు పడుతుంటే ఏమీ మాట్లాడటం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేసింది.