శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 29 జులై 2015 (09:17 IST)

దేశం అంటే భారతదేశంలా ఉండాలని కలాం అనేవారు : లక్ష్మీ నారాయణ

దేశం అంటే భారతదేశంలా.. పౌరులంటే భారతీయులు అనేలా ఉండాలని భారత మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం అనేవారని సీబీఐ మాజీ జాయింట్ డైరక్టర్, ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ గుర్తు చేసుకున్నారు. కలాం మృతిపై ఆయన స్పందిస్తూ.. దేశంలోని యువశక్తి అంతా ఏకమైతే 2020 కల్లా భారత్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమమైన దేశంగా తీర్చిదిద్దవచ్చని చెప్పేవారన్నారు. కలాం ఆలోచనలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇపుడు ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. ఆయన ఆలోచనలు భావితరాలకు కథలుగా చెబుదామని జేడీ పిలుపునిచ్చారు. 
 
ప్రస్తుతం థానే జాయింట్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న జేడీ.. కలాం మృతిపట్ల తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. కలాంలాంటి వ్యక్తిని మనం చూడటం అదృష్టమన్నారు. ఆయన అందించిన స్ఫూర్తిని మనమంతా కలిసి ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. హైదరాబాదులో ఉండగా, కలాంతో కలిసి పనిచేసే అవకాశం లభించిందని, ఆయన ఆలోచనలు, ఆచరణ అనితరసాధ్యమన్నారు. విద్యార్థులు, యువతలో నిద్రాణమై ఉన్న శక్తిని మేల్కొలపాలని ఆయన అనేవారని గుర్తు చేసుకున్నారు.