శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 15 మే 2017 (12:21 IST)

అనుమానం పెనుభూతమై... పెళ్లి కుమార్తెను వివస్త్ర చేసిన వరుడు బంధువులు... ఎక్కడ?

అనుమానం పెనుభూతమైంది. బొల్లి వ్యాధి ఉందన్న అనుమానంతో పెళ్లి కుమార్తెను వరుడు బంధువులు వివస్త్రను చేసి నిశితంగా పరిశీలించారు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి

అనుమానం పెనుభూతమైంది. బొల్లి వ్యాధి ఉందన్న అనుమానంతో పెళ్లి కుమార్తెను వరుడు బంధువులు వివస్త్రను చేసి నిశితంగా పరిశీలించారు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... యూపీలోని మహోబా జిల్లాలో జైహింద్ అనే యువకుడికి, తీజా అనే యువతికి పెళ్లి కుదిరింది. మరికొన్ని నిమిషాల్లో పెళ్లి అనగా... పెళ్లి కొడుకు నాకీ పెళ్లి వద్దంటూ అడ్డం తిరిగాడు. 
 
పెళ్లి కూతురికి బొల్లి వ్యాధి ఉందని, అందుకే తనకీ పెళ్లి వద్దని చెప్పాడు. అలాంటి వ్యాధి తనకు లేదని, తాను సంపూర్ణ ఆరోగ్యవంతురాలినని వధువు చెప్పినా వినిపించుకోలేదు. ఆమె తల్లిదండ్రులు బతిమిలాడినా పట్టించుకోలేదు. పెళ్లి కూతురు కుటుంబం అంటే గిట్టని ఓ వ్యక్తి చేసిన దుష్ప్రచారాన్ని పెళ్లికొడుకు నిజంగానే నమ్మాడు. 
 
చివరకు ఈ పంచాయితీ పోలీసుల వద్దకు చేరింది. ఇరు కుటుంబాల పెద్దలతో మాట్లాడిన పోలీసులు ఆమె శరీరంపై మచ్చలు ఉన్నాయో, లేదో పరీక్షించుకోవాలని సలహా ఇచ్చారు. పెళ్లి కొడుకు బంధువులు తీజాను ఓ రూమ్‌లోకి తీసుకెళ్లి ఆమెను వివస్త్రను చేసి పరీక్షించారు. 
 
ఆమె ఒంటిపై ఎలాంటి మచ్చలు లేకపోవడంతో అదంతా ఒట్టి పుకారేనని తేలింది. దీంతో పెళ్లి కొడుకు, అతని బంధువులు వధువుకు, ఆమె కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. ఇక్కడ అసలు ట్విస్టేంటంటే అనంతరం పెళ్లి తంతు యథాతథంగా జరిగిపోయింది.