గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 29 మే 2016 (10:02 IST)

కాన్పూరులో అభినవ ధర్మరాజు... భార్యను బెట్టింగ్‌లో పెట్టిన భర్త

నాడు ధర్మరాజు భార్య ద్రౌపదిని ఫణంగా పెట్టి జూదమాడాడు. జూదంలో భార్యను ఓడిపోయాడు. ఇది కురుక్షేత్ర యుద్ధానికి దారితీసింది. ఇపుడు అభినవ ధర్మరాజు కూడా భార్యను ఫణంగా పెట్టి జూదమాడారు. ఇక్కడ కూడా భార్యను జూదంలో కోల్పోయాడు. ఈ అభినవ ధర్మరాజు జైలుపాలుకానున్నాడు. 
 
ఇప్పటికే పలు నేరాలు, ఘోరాలు, అత్యాచారాలకు కేంద్ర బిందువుగా మారిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా అభినవ ధర్మారాజులు కూడా పుట్టుకొస్తున్నారు. ఈ రాష్ట్రంలోని కాన్పూరుకు చెందిన ఓ జూదగాడు.. ఏకంగా తన భార్యను బెట్టింగ్‌లో పెట్టాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఈ బెట్టింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
కాన్పూర్‌కు చెందిన ఓ వ్యక్తికి ఐపీఎల్‌ బెట్టింగ్‌లంటే మహాపిచ్చి. ఈ బెట్టింగ్‌లలో సర్వం పోగొట్టుకున్నాడు. ఇక, మిగిలిన ఆస్తి ఒక్క భార్యే! ఆ భార్యనూ బెట్టింగ్‌లో పెట్టి ఓడిపోయాడు. మరి బెట్టింగ్‌లు పెట్టినవాళ్లు మిన్నకుంటారా? చెప్పండి!. ఇంటికొచ్చారు. ఆమెను చెరబట్టారు. ఫోన్ నంబర్ తీసుకున్నారు. ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. అసభ్యంగా ప్రవర్తించసాగారు. 
 
ఆ వేధింపులు తాళలేక పోయిన ఆ అభినవ ధర్మరాజు భార్య స్వచ్ఛంద కార్యకర్తల సాయంతో పోలీసులను ఆశ్రయించింది. దీంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లైన మొదటి రోజు నుంచే భర్త నుంచి వేధింపులు మొదలయ్యాయని, నగలు, ఆస్తులన్నింటినీ షేర్‌ మార్కెట్‌లో కోల్పోయాడని ఆమె వివరించింది. 
 
తన తల్లిదండ్రుల నుంచి రూ.7 లక్షలు తీసుకురావాలని హింసించాడని ఫిర్యాదు చేసింది. కాగా, ఆమె భర్తపై కేసు నమోదు చేశామని, కారణాలను విచారించి నిందితుడిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడిచారు. అయితే, అభినవ ధర్మరాజు వివరాలు వెల్లడించేందుకు మాత్రం పోలీసులు నిరాకరించారు.