గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 16 మే 2018 (08:38 IST)

కర్ణాటక ఎన్నికల్లో తెలుగు 'పంచ్' ... గింగరాలు తిరిగిన బీజేపీ అభ్యర్థులు...

కర్ణాటక ఎన్నికల్లో తెలుగోడి పంచ్ పడింది. ఫలితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గింగరాలు తిరిగారు. ఈ కారణంగా ఆ పార్టీ మ్యాజిక్ మార్కుకు ఎనిమిది అడుగుల (8 సీట్లు) దూరంలో ఆగిపోయింది. ఇపుడు ప్రభుత్వ ఏర్పా

కర్ణాటక ఎన్నికల్లో తెలుగోడి పంచ్ పడింది. ఫలితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గింగరాలు తిరిగారు. ఈ కారణంగా ఆ పార్టీ మ్యాజిక్ మార్కుకు ఎనిమిది అడుగుల (8 సీట్లు) దూరంలో ఆగిపోయింది. ఇపుడు ప్రభుత్వ ఏర్పాటు అనేది ఇటు బీజేపీ - అటు కాంగ్రెస్ దళాల మధ్య దోబూచులాడుతోంది.
 
నిజానికి జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు కలిసి తెలుగు ప్రజలకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేశాయి. రాష్ట్రాన్ని అడ్డంగా ముక్కలు చేసిన పాపానికి కాంగ్రెస్ పార్టీని ఏపీలో భూస్థాపితం చేశారు. ఇపుడు బీజేపీని కర్ణాటకలో మట్టికరిపించారు. 
 
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు అమలు చేయకుండా, నిధులు ఇవ్వకుండా వేధిస్తున్న బీజేపీకి కర్ణాటకలోని తెలుగు ఓటర్లు తగిన గుణపాఠం చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి తెలుగు ఓటర్లు జైకొట్టి ఉంటే.. ఆ పార్టీ విజయం నల్లేరుపై నడకలా సాగేది. కానీ, తెలుగు ఓటర్లు మొఖం చాటేయడంతో ఇపుడు ఆ పార్టీ పరిస్థితి బొక్కబోర్లాపడ్డ చందంగా మారింది. 
 
రాయచూరు, బళ్లారి, చిక్‌బళ్లాపూర్‌, కోలార్‌ జిల్లాల్లో తెలుగువారి సంఖ్యాబలం ఉన్న నియోజకవర్గాలు 46. వీటిలో కాంగ్రెస్‌ 32 చోట్ల గెలవగా.. జేడీఎస్‌ 9 స్థానాలు సాధించింది. బీజేపీకి కేవలం 5 స్థానాలు వచ్చాయంటే తెలుగు ఓటర్లు ఏమేరకు ప్రభావితం చేశారో అర్థం చేసుకోవచ్చు. అంటే ఆంధ్రకు అన్యాయం చేయడం వల్ల భారతీయ జనతా పార్టీ కనీసం 15-20 సీట్లు కోల్పోయిందని చెప్పొచ్చు. 
 
బళ్లారి, రాయ్‌చూర్, కొప్పళ్, కలబురిగి, బీదర్, గ్రేటర్ బెంగుళూరు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 67 అసెంబ్లీ సీట్లు ఉండగా, వీటిలో బీజేపీ కేవలం 26  సీట్లను మాత్రమే గెలుచుకుంది. ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకుని కాంగ్రెస్ పార్టీ 34 సీట్లలోనూ, జేడీఎస్ 7 సీట్లలో విజయం సాధించడం గమనార్హం.