శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 16 మే 2018 (09:47 IST)

దటీజ్.. ప్రియాంకా గాంధీ... చిన్నపాటి సలహాతో బీజేపీ ఆశలు గల్లంతు

కర్ణాటక ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడక ముందే యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ కుమార్తె ప్రియంకా గాంధీ ఇచ్చిన చిన్నపాటి సలహా కమలనాథులకు తేరుకోలేని షాకిచ్చింది.

కర్ణాటక ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడక ముందే యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ కుమార్తె ప్రియంకా గాంధీ ఇచ్చిన చిన్నపాటి సలహా కమలనాథులకు తేరుకోలేని షాకిచ్చింది. ఆ ఒక్క సలహాతో కర్ణాటకలో నాలుగు నెలలపాటు పడిన శ్రమ అంతా వృధాపోయి బీజేపీ నేతలు, శ్రేణులు జావగారి పోయారు. ప్రభుత్వ ఏర్పాటు అంశం ఇపుడు సందిగ్ధంలో పడింది. అసలు ప్రియాంకా గాంధీ ఇచ్చిన ఆ చిన్నపాటి సలహా ఏంటో ఓసారి పరిశీలిద్ధాం.
 
పడి లేచిన కెరటంలా కాంగ్రెస్‌ అనూహ్యంగా మేల్కొని పకడ్బందీ వ్యూహంతో బీజేపీకి చుక్కలు చూపించడం రాజకీయవర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. కర్ణాటక ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత కాంగ్రెస్ శ్రేణులు పూర్తిగా నిరాశలో కూరుకునిపోయారు. కానీ, సోనియా గాంధీ కుటుంబం మాత్రం స్థైర్యాన్ని కోల్పోలేదు. ఎప్పుడైతే బీజేపీ- మెజారిటీకి చాలా దూరంగా వెళుతోందని గ్రహించిందో వెంటనే రంగంలోకి దిగింది. 
 
ఒకవైపు బీజేపీ కేంద్ర కార్యాలయంలో సంబరాలు చేసుకుంటుండగా, మరోవైపు ఢిల్లీలోని జన్‌పథ్‌లో రాహుల్‌ తన తల్లి సోనియా, సోదరి ప్రియాంకతో మధ్యాహ్న భోజనం సమయంలో రాజకీయాలకు పదునుపెట్టారు. బీజేపీకి అధికారాన్ని బంగారు పళ్లెంలో అప్పగించి విపక్షంలో కూర్చోవడం కన్నా చొరవ తీసుకొని జేడీఎస్‌తో కలిసి సర్కారు ఏర్పాటు చేయడం మంచిదన్న నిర్ణయానికి వచ్చారు. అయితే, జేడీఎస్‌ను ఒప్పించడమే వారిముందున్న అతిపెద్ద సవాల్. 
 
సరిగ్గా ఆ సమయంలోనే ప్రియాంక గాంధీ తన మనసులోని మాటను వెల్లడించారు. ముఖ్యమంత్రి పదవి జేడీఎస్‌కు వదిలేస్తేనే బీజేపీకి అడ్డుకట్ట వేయడం పెద్ద పని కాదని తేల్చిచెప్పారు. కుమారస్వామికి సీఎం పదవి ఆఫర్‌ చెయ్యమని రాహుల్‌ను ఒప్పించారు. ఆమె సూచనను వెంటనే రాహుల్‌ ఒప్పుకున్నారు. ఆ వెంటనే.. తమ నమ్మినబంటు గులాం నబీ ఆజాద్‌ను రంగంలోకి దించారు. 
 
అజాద్‌కు విషయం చెప్పి సీఎం పదవి ఇస్తామన్న విషయాన్ని చేరవేయమన్నారు. అజాద్‌ వెంటనే కుమారస్వామితో మాట్లాడి ఒప్పించారు. ఆ తర్వాత సోనియా స్వయంగా దేవెగౌడకు ఫోన్‌ చేసి కలిసి పనిచేద్దామని ఆఫర్‌ చేశారు. దానికి ఆయన అంగీకరించారు. కుమారస్వామితో కూడా సోనియా మాట్లాడారు. దేవెగౌడ మాత్రం కాంగ్రెస్‌ ప్రభుత్వంలో చేరితేనే తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పారు. నిజానికి కాంగ్రె్‌సకు కూడా కావాల్సింది అదే.
 
మూడు రాష్ట్రాల్లో గతంలో దెబ్బతిన్న నేపథ్యంలో చివరి నిమిషం వ్యూహాలను రచించేందుకు సోమవారం నుంచి గులాం నబీ ఆజాద్‌, అశోక్‌ గెహ్లాట్‌ బెంగళూరులోనే మకాం వేశారు. ఈ మొత్తం మంత్రాంగం ప్రియాంక సమక్షంలో, ఆమె పర్యవేక్షణలో జరిగినట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్‌ కన్నా ముందే కుమారస్వామి మేల్కొన్నారని, బెంగళూరులో మకాం వేసిన కాంగ్రెస్‌ నేతలతో భేటీ అయ్యారని మరో కథనం వినిపించింది. మొత్తంమీద దెబ్బతిన్న పులిలా కాంగ్రెస్‌ అనూహ్యంగా మేల్కొని పకడ్బందీ వ్యూహంతో బీజేపీకి చుక్కలు చూపించడం రాజకీయవర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది.