గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 16 మే 2018 (12:56 IST)

ఆరుగురు బీజేపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు.. కాంగ్రెస్ నేత పాటిల్

కర్ణాటక రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఉత్కంఠను రేపుతున్నాయి. గంటగంటకూ సరికొత్త ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఒక పార్టీని మించి మరొక పార్టీ ప్రలోభాల క్రీడలను ఆడుతున్నాయి. ఇందుకు పలు నేతల ప్రకటనలే నిదర్శనం

కర్ణాటక రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఉత్కంఠను రేపుతున్నాయి. గంటగంటకూ సరికొత్త ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఒక పార్టీని మించి మరొక పార్టీ ప్రలోభాల క్రీడలను ఆడుతున్నాయి. ఇందుకు పలు నేతల ప్రకటనలే నిదర్శనం. బీజేపీ భారీ ఆఫర్లు తమకు వస్తున్నట్టు కాంగ్రెస్ నాయకుడు అమరగౌడ లింగనగౌడ పాటిల్ వెల్లడించారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, 'బీజేపీ నేతలు నాకు కాల్ చేశారు. మాతో వస్తే మంత్రి పదవి ఇస్తామని చెప్పారు. కానీ, నేను కాంగ్రెస్‌తోనే ఉంటాను. హెచ్.డి. కుమారస్వామే మా ముఖ్యమంత్రి' అని లింగనగౌడ పాటిల్ పునరుద్ఘాటించారు. 
 
మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత ఎంబీ పాటిల్ మరో బాంబు పేల్చారు. ఆరుగురు బీజేపీ ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని వెల్లడించారు. వీరంతా తమతో ఎపుడైనా జట్టు కట్టవచ్చని చెపుతున్నారు. పైగా, తామంతా కలిసే ఉన్నామని స్పష్టం చేశారు. 
 
ఇదిలావుంటే, భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. ఇందులోభాగంగా, ఆరుగురు కాంగ్రెస్, ఇద్దరు జేడీఎస్ ఎమ్మెల్యేలకు గాలం వేసినట్టు వార్తలు వస్తున్నాయి. పైగా, వీరిని రహస్య స్థావరానికి తరలించేందుకు ప్రత్యేక హెలికాఫ్టర్లను కూడా పంపినట్టు సమాచారం. 
 
ఇంకోవైపు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భీమానాయక్, అమెర్ గౌడ నాయక్‌లు బీజేపీకి మద్దతు ప్రకటించినట్టు విశ్వసనీయ సమాచారం. వీరి కోసం బీదర్, గుల్బర్గాలకు బీజేపీ అధిష్టానం ప్రత్యేక హెలికాప్టర్లను పంపినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, బెంగళూరు రాజకీయం మరింత వేడెక్కింది.