శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 22 మే 2018 (11:41 IST)

కుమార స్వామి పట్టాభిషేకానికి సోనియా - చంద్రబాబు - కేసీఆర్ కూడా...

కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కుమార స్వామి ఈనెల 24వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మరోవైపు, కుమార స్వామి మాత్రం ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ మాజీ అధినేత్రి

కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కుమార స్వామి ఈనెల 24వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మరోవైపు, కుమార స్వామి మాత్రం ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ, అధ్యక్షుడు రాహుల్ గాంధీలతో సమావేశమై, వారిభరోసాతో పాటు ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా వారిని ఆహ్వానించారు.
 
ఆ తర్వాత కుమారస్వామి నేరుగా బీఎస్పీ ఆఫీస్‌కు వెళ్లారు. ఆ పార్టీ అధ్యక్షురాలు మాయావతిని కలిశారు. ఎన్నికల్లో మద్దతిచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. బుధవారం జరిగే తన ప్రమాణ స్వీకారానికి హాజరుకావాలని ఆహ్వానించారు. తర్వాత సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీతో ఫోన్‌లో మాట్లాడారు. ఏచూరీని కూడా ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారు. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, తెరాస అధినేత కేసీఆర్‌లను కూడా ఆయన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. వీరంతా కుమార స్వామి పట్టాభిషేకానికి హాజరుకానున్నారు. 
 
ఇదిలావుంటే, కర్ణాటక మంత్రివర్గం కూర్పు మంగళవారం సాయంత్రానికి ఖరారు చేయనున్నారు. మంత్రివర్గం కూర్పు, ఇతర అంశాలను ఖరారు బాధ్యతను కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు కేసీ.వేణుగోపాల్‌కు కాంగ్రెస్ పెద్దలు అప్పగించారు. మరోవైపు, జేడీఎస్‌తో పొత్తు విషయంలో కొందరు కాంగ్రెస్ నేతలు అసంతృప్తిగా ఉన్నారన్న వార్తలను కుమారస్వామి ఖండించారు. అవన్నీ బోగస్ వార్తలేనని, అందులో ఎంతమాత్రం నిజం లేదని ఆయన తేల్చిచెప్పారు. మరోవైపు కాంగ్రెస్-జేడీఎస్‌ల మధ్య విభేదాలు వచ్చాయన్న వార్తలను మాజీ హోంమంత్రి రామలింగారెడ్డి కొట్టిపారేశారు. తాము వంద శాతం సంతోషంగా ఉన్నామన్నారు.