గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 2 ఏప్రియల్ 2018 (09:04 IST)

కల్లోల కాశ్మీరం : భారీ ఎన్‌కౌంటర్... 13 ఉగ్రవాదుల కాల్చివేత

జమ్మూకాశ్మీర్ రాష్ట్రం మరోమారు అల్లర్లతో అట్టుడికిపోయింది. కాశ్మీర్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ కారణంగా మరోమారు అల్లర్లు చెలరేగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 13 మంది ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు కాల్చిచంపాయి.

జమ్మూకాశ్మీర్ రాష్ట్రం మరోమారు అల్లర్లతో అట్టుడికిపోయింది. కాశ్మీర్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ కారణంగా మరోమారు అల్లర్లు చెలరేగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 13 మంది ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు కాల్చిచంపాయి. షోపియాన్‌ జిల్లా ద్రాగద్‌లో ఏడుగురు ఉగ్రవాదులు, అదే జిల్లాలోని కచుదూరా దగ్గర ఎదురుకాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు జరిపిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఆర్మీ జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. 
 
అనంతనాగ్‌ జిల్లా దియాల్గాం ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది మరణించగా మరొక ఉగ్రవాదిని భద్రతా బలగాలు సజీవంగా పట్టుకున్నాయి. దాదాపు 100 మంది వరకూ భద్రతా బలగాలు, పౌరులు గాయపడ్డారు. ఈ ఎన్‌కౌంటర్లకు నిరసనగా భద్రతా బలగాలపై కాశ్మీర్ యువత రాళ్లు రువ్వింది. దీంతో వారిని అదుపు చేసేందుకు భద్రతా బలగాలు బాష్పవాయును ప్రయోగించారు. 
 
ఆదివారం ఉగ్రవాదులే లక్ష్యంగా భద్రతా బలగాలు కాశ్మీర్‌లో భారీ ఆపరేషన్‌ నిర్వహించాయి. దక్షిణ కాశ్మీర్‌లోని షోపియాన్, అనంత్‌నాగ్‌ జిల్లాల్లోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇటీవలి కాలంలో కాశ్మీర్‌ లోయలో ఉగ్రవాద గ్రూపులకు వ్యతిరేకంగా జరిగిన అతిపెద్ద ఎదురుదాడి ఇదేనని ఆర్మీ, పోలీసు, సీఆర్‌పీఎఫ్‌ అధికారులు తెలిపారు.
 
ఎన్‌కౌంటర్ల‌తో కాశ్మీర్‌ లోయలో ముందు జాగ్రత్తగా మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవల్ని నిలిపివేశారు. హురియత్‌ నేతలు సయద్‌ అలీ షా గిలానీ, మిర్వైజ్‌ ఉమర్‌ ఫరూఖ్, యాసిన్‌ మాలిక్‌ను గృహ నిర్బంధంలో ఉంచారు. అలాగే కాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. మరోవైపు ఈ సంఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన పౌరుల మృతికి జమ్మూ కాశ్మీర్‌ సీఎం మెహబూబా ముఫ్తీ సంతాపం తెలిపారు. అలాగే మరణించిన ముగ్గురు జవాన్లకు ఆమె నివాళులర్పించారు.