శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 18 ఆగస్టు 2014 (12:46 IST)

అపోహలకు చెక్.. చర్చలతో వివాదాలు అవుట్: బాబు

చర్చల వల్ల అపోహలు, వివాదాలు తొలుగుతాయి. తెలుగు రాష్ట్రాలు భౌగోళికంగా విడిపోయినా, తెలుగుజాతి ఒక్కటే. వివాదాల వల్ల రెండు రాష్ట్రాలకు నష్టమే మిగులుతుంది. కనుక కూర్చుని మాట్లాడుకుంటే అన్ని సమస్యలకు పరిష్కార మార్గాలు దొరుకుతాయి’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. 
 
తెలంగాణకు పోర్టులేదని, వాణిజ్యకార్యకలాపాల కోసం బందరు పోర్టు వాడుకుంటామని కేసీఆర్ ప్రస్తావించారన్నారు. రాజధాని విషయమై సలహాలు ఇచ్చారని, ఎవరు సలహా ఇచ్చినా స్వీకరిస్తామన్నారు. 
 
ఆదివారం గవర్నర్ సమక్షంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చలు జరిపిన ఆయన, సాయంత్రం విలేఖరులతో మాట్లాడారు. చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయన్నారు. ప్రధానంగా రాష్ట్ర క్యాడర్ ఉద్యోగుల విభజన, 9, 10 షెడ్యూల్ అంశాలపై చర్చించామని చెప్పారు.
 
ఉద్యోగుల విభజనకు సంబంధించి ఇరు రాష్ట్రాల సిఎస్‌లు పరస్పర సహకారంతో ఎవరికి అన్యాయం జరగకుండా చూడాలని ఆదేశించినట్టు ఆయన తెలిపారు. అవసరమైతే మరోసారి ఇద్దరు సిఎంలు కలిసి స్పష్టత వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. 
 
తెలంగాణ ప్రభుత్వం తెరపైకి తెచ్చిన 1956 స్థానికత అంశం చేయడానికి వీలుకాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. స్థానికతకు సంబంధించి రాష్టప్రతి ఆదేశాలున్నాయని, వాటిని తెలంగాణ ప్రభుత్వం పాటిస్తుందని తాము ఆశిస్తున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు.
 
హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ వారితోపాటు దేశంలోని చాలా రాష్ట్రాల ప్రజలు జీవిస్తున్నారని, వారందర్నీ తెలంగాణ ప్రభుత్వం ఒకేలా చూస్తుందని చంద్రబాబు ఆశిస్తున్నామన్నారు. అలాగే హైదరాబాద్ శాంతి భద్రతలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇత్యాది అంశాలు చర్చకు రాలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. 
 
ఇవి ప్రాథమిక చర్చలేనని, ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి మరిన్ని సమావేశాలు ఏర్పాటు చేసుకుంటామని ఆయన తెలిపారు.