కీనన్-రూబెన్ హత్య కేసు: నలుగురికి జీవితఖైదు.. న్యాయం కోసం అడుక్కోవాల్సి వచ్చిందా?!
కీనన్-రూబెన్ హత్య కేసులో నలుగురు నిందితులకు జీవితఖైదు ముంబైలో ప్రత్యేక మహిళల న్యాయస్థానం విధించింది. 2011 అక్టోబర్లో ముంబైలో ఓ బృందం బాలికల్ని వేధింపులకు గురిచేస్తుండగా కీనన్ సాంటోస్, రూబెన్ ఫెర్నాండెజ్ అనే యువకులు ఎదురు తిరిగి.. తమ స్నేహితురాళ్లైన బాలికలకు అండగా నిలిచారు. ఈ క్రమంలో వారిద్దరూ దుండగులచే హత్యకు గురైయ్యారు. ఈ ఘటనలో జితేంద్ర, జితేంద్ర రానా, సునీల్ బోధ్, దీపక్ తివాల్, సతీష్ దుల్హాజ్లను కోర్టు దోషులుగా నిర్ధారించింది.
వివరాల్లోకి వెళితే ముంబై అంధేరి ప్రాంతంలో అంబోలీ బార్ వెలుపల తమ స్నేహితురాళ్లపై వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తుల్ని కీనన్, రూబెన్లు అడ్డుకున్నారు. కీనన్, రూబెన్ అడ్డుకోవడంతో కొంత వెనక్కి తగ్గిన దుండగులు.. కొద్దిసేపటికే చాలామందితో వచ్చి ఇద్దరిపై దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. కీనన్ అక్కడికక్కడే గాయాలతో మరణించగా, రూబెన్ పదిరోజుల పాటు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
ఈ నేపథ్యంలో ముంబై ప్రత్యేక కోర్టు నలుగురు నిందితులకు జీవితఖైదు విధించడంపై కీనన్ తండ్రి హర్షం వ్యక్తం చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. సమాజం కోసం మంచి చేసేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయిన యువకులకు ఐదేళ్ల తర్వాతే న్యాయం జరిగిందని కీనన్ తండ్రి వాపోయారు. న్యాయం కోసం అడుక్కోవాల్సి వచ్చిందన్నారు.