గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 3 సెప్టెంబరు 2015 (10:14 IST)

మమ్మల్ని రేప్ చేసి.. నగ్నంగా ఊరేగిస్తారట.. ఏం చేయాలి.. యూపీ సిస్టర్స్ ఆవేదన

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ ఖాప్ పంచాయితీ ఇచ్చిన తీర్పు అక్కాచెల్లెళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తమ అన్న అగ్రకులానికి చెందిన యువతి ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకుగాను గ్రామపెద్దలు తమను శిక్షించాలని చూస్తున్నారని వాపోతున్నారు. ఈ శిక్షలో భాగంగా తమపై అత్యాచారం చేసి.. గ్రామంలో నగ్నంగా ఊరేగించాలని గ్రామస్థులంతా ఎదురు చూస్తున్నారంటూ వారు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ అక్కాచెల్లెళ్లు ఢిల్లీలో ఉంటున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సంక్రోట్ గ్రామానికి చెందిన రవికుమార్ అనే యువకుడు దళితుడు. ఇదే గ్రామానికి చెందిన ఉగ్రకులమైన జాట్ వర్గానికి చెందిన 21 యేళ్ల యువతిని ప్రేమించాడు. ఈ విషయం బయటకు తెలియడంతో ఇద్దరినీ హెచ్చరించారు. పెళ్లి జరిగితే జరిగే పర్యవసానాలపై చర్చించుకున్న మీదట ఆ యువతి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. 
 
అయితే, ఆ యువతి చేసుకున్న వ్యక్తితో ఉండలేక తిరిగి ఊరికి వచ్చింది. పాత ప్రేమికులు తిరిగి కలుసుకుని, ఎవరికీ చెప్పకుండా వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న జాట్ కుల పెద్దలు.. తమ పలుకుబడిని ఉపయోగించి మాదకద్రవ్యాల కేసును రవికుమార్‌పై పెట్టించి మీరట్ జైలుకు తరలించారు. ఈ కేసులో అతనికి బెయిల్ మంజూరైనప్పటికీ.. కుల పెద్దలకు భయపడి జైల్లోనే ఉంటున్నాడు. 
 
అయితే, ఈ యువకుడికి ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. రవికుమార్ చేసిన నేరానికి వీరిద్దరిని రేప్ చేసి నగ్నంగా గ్రామంలో ఊరేగించాలని ఖాప్ పంచాయతీ పెద్దలు తీర్పునిచ్చారు. ఆ సమయంలో అదృష్టవశాత్తు ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఓ వివాహం కోసం ఢిల్లీకి వచ్చారు. ఆ తర్వాత విషయం తెలుసుకుని అక్కడే ఉండిపోయారు. దీనిపై ఆ సిస్టర్స్ తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. 
 
తమ సోదరుడు, ఓ అగ్రవర్ణ యువతి ప్రేమించుకున్నందుకు మమ్మల్ని బలి పశువులను చేయాలని చూస్తున్నారంటూ వాపోతున్నారు. తమ పరిస్థితి గురించి ప్రధాని, ముఖ్యమంత్రి, మానవ హక్కుల కమిషన్, ఎస్టీ కమిషన్‌లకు లేఖలు రాసినా ఎలాంటి స్పందన లేదని, రక్షణ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించామని చెపుతున్నారు. 
 
తాము ఊరికి వెళితే, తమపై అత్యాచారం చేయడానికి ఎందరో కాచుకు కూర్చున్నారని తెలిపింది. తమ గ్రామంలో ఏడువేల మంది జాట్ కులస్తులు, 250 మంది దళితులు ఉన్నారని వెల్లడించారు. ఇలా ఎంతకాలం దాక్కోవాలి. ఊరికి వెళితే, మా పరిస్థితి కుక్కలు చింపిన విస్తరే అవుతుంది. ఖాప్ పంచాయతీలు చెల్లవంటూ సుప్రీంకోర్టు చెప్పిన తీర్పులు పట్టించుకునేవారు లేరు. మాకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నా అని ఆ అక్కాచెల్లెళ్లు ప్రాధేయపడుతున్నారు.