గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : శనివారం, 28 మార్చి 2015 (10:25 IST)

కృష్ణా జలాల కేసు ఏప్రిల్‌కు వాయిదా..! పంచుకోవడమే బెస్ట్.. సుప్రీం అభిప్రాయం..!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల మధ్య కొంతకాలంగా సాగుతున్న కృష్ణా జలాల వివాదం కేసును సుప్రీం కోర్టు ఏప్రిల్ 29వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసు శుక్రవారం విచారణకు రాగా కృష్ణానది జలాల్లో ఉమ్మడి రాష్ట్రానికి లభించిన నీటిని కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు పంచుకోవడం ద్వారా వివాదానికి తావుండదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 
 
కృష్ణా ట్రిబ్యునల్‌ నీటి పంపిణీ వివాదంపై పిటిషనర్లు, ప్రతివాదులైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలు మూడు వారాల్లోగా తమ వాదనల్ని మూడు పేజీలకు మించకుండా దాఖలు చేయాలని, తదుపరి విచారణ ఏప్రిల్‌ 29వ తేదీన జరుపుతామని తెలిపింది.
 
అంతే కాకుండా జలవివాదాన్ని ఎక్కువ కాలం కొనసాగించొద్దని కోర్టు ఈ సందర్భంగా మూడు రాష్ట్రాలకూ హితవు పలికింది. ఎక్కువ వాయిదాలు కోరకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. అయితే గెజిట్‌లో తమ వాదనలు కూడా వినాలని తెలంగాణ ప్రభుత్వం కొంతకాలంగా కోరుతూ వస్తున్న విషయం తెలిసిందే.