లఖ్వీకి బెయిల్.. భారత్లో ఆగ్రహం.. అద్వానీ.. జవదేకర్ కామెంట్స్!
ముంబై మారణహోమం నిందితుడు, లష్కర్ ఎ తోయిబా ఉగ్రవాది జకీవుర్ రహ్మన్ లఖ్వీకు పాకిస్థాన్ తీవ్రవాద వ్యతిరేక కోర్టు బెయిల్ మంజూరు చేయడంపై భారతదేశంలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు తీవ్రవాదంపై చిత్తశుద్ధితో పోరాటం చేస్తామని ప్రకటించిన మరుసటి రోజునే లఖ్వీకి బెయిల్ మంజూరు కావడం భారత్ విస్మయం వ్యక్తం చేస్తోంది.
ఇదే అంశంపై బీజేపీ అగ్రనేత ఎల్కే. అద్వానీ స్పందిస్తూ.. పాకిస్థాన్లో అంతే. ఈ తీర్పు పాకిస్థాన్ ప్రతిష్టను దిగజారుస్తుందన్నారు. వారి న్యాయవ్యవస్థపై నేనేమి మాట్లాడబోనని చెప్పారు. ఎన్సీపీ నేత మజీద్ మెమన్ మాట్లాడుతూ పెషావర్లో చిన్నపిల్లలను ఉగ్రవాదులు చంపిన ఘటన ఇంకా మరిచిపోలేదని, దాన్ని ప్రపంచమంతా చూసిందన్నారు. ఉగ్రవాదులను ఏరివేస్తామని పాక్ నేతలు చెబుతున్నారని, ఇలాంటి సమయంలో బెయిల్ రావడం విచారకరమని ఆయన అన్నారు.
కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ స్పందిస్తూ ఇదే అంశంపై లఖ్వీ లాంటి ఉగ్రవాదికి బెయిల్ రావడం విచారకరమన్నారు. ఉగ్రవాదికి బెయిల్ ఇవ్వడం వల్ల పాక్ ప్రతిష్ట మరింత దిగజారితుందన్నారు. ఉగ్రవాదులను అంతం చేస్తామని పాక్ ప్రధాని నవాజ్ షరీప్ చెప్పారని... దాన్ని ప్రపంచమంతా స్వాగతించిందని... ఇప్పుడు ఉగ్రవాది రహ్మన్ లఖ్వీకు బెయిల్ వచ్చిందని మండిపడ్డారు. లఖ్వీ, హఫీజ్ సయీద్తో కలిసి ఉగ్రవాద దాడులకు పాల్పడ్డాడని జవదేకర్ ఆరోపించారు.